COVID19 in India: భారత్‌లో కొత్తగా 48,786 కోవిడ్ కేసులు నమోదు, గడిచిన ఒక్కరోజులో మరో 61,588 మంది రికవరీ; నేటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు కోవిన్ పోర్టల్ ద్వారానే వ్యాక్సిన్ సరఫరా
Covid in India | (Photo-PTI)

New Delhi, July 1:  భారతదేశంలో నేటి నుంచి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు వ్యాక్సిన్ డోసుల కొనుగోళ్లు కోవిన్ పోర్టల్‌లోనే నిర్వహించాలి. నిన్నటి వరకు, ప్రైవేట్ ఆసుపత్రులు నేరుగా వ్యాక్సిన్ తయారీదారులను సంప్రదించి వ్యాక్సిన్లను సేకరించే అవకాశం ఉండేది. కానీ జూలై1 నుండి వ్యాక్సిన్ల సరఫరాకు సంబంధించి పూర్తి నిర్ణయాధికారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది. ఈ కొత్త మార్పులు జాతీయ టీకా కార్యక్రమాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి.

ఇక దేశవ్యాప్తంగా అదుపులోకి వస్తుంది, అయితే రోజూవారీ కోవిడ్ కేసులు ఈరోజు స్వల్పంగా సుమారు 3 వేల మేర పెరిగి మళ్లీ 50 వేలకు చేరువగా నమోదయ్యాయి. గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 48,786 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,04,11,634 చేరింది. నిన్న ఒక్కరోజే 1,005 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,99,459కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 61,588 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,94,88,918 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 5,23,257 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.97% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.72 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.31% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 30 నాటికి దేశవ్యాప్తంగా 41,20,21,494 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 19,21,450 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 27,60,345 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 33.57 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 33,57,16,019 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 27.60 కోట్లు ఉండగా, 5.96 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.