New Delhi, June 25: భారత్లో కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి అదుపులోకి వస్తుంది, అయినపటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే ఆరోగ్య నిపుణుల హెచ్చరికలతో కొంత ఆందోళన వాతావరణం నెలకొని ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ కరోనా కేసులు వెలుగులోకి వస్తున్నాయి. అయితే థర్డ్ వేవ్ తీవ్రత ప్రజల ధోరణిపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేయబడుతున్నాయి. అయినా కూడా ప్రజలు మాస్క్ వాడటం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు పాటిస్తే థర్డ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉండదని సూచిస్తున్నారు.
ఇక దేశంలో రోజూవారీ కోవిడ్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులున్నప్పటికీ కేసులు సుమారు 50 వేలల్లో నమోదవుతున్నాయి. అలాగే మరణాల రేటు కూడా స్థిరంగా కొనసాగుతుంది.
గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 51,667 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,01,34,445 చేరింది. నిన్న ఒక్కరోజే 1,329 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,93,310కు పెరిగింది.
అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 64,527 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,91,28,267 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,12,868 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.66% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.03 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.31% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
India's COVID Status Update:
India reports 51,667 new #COVID19 cases, 64,527 recoveries and 1,329 deaths in the last 24 hours, as per the Union Health Ministry.
Total cases: 3,01,34,445
Total recoveries: 2,91,28,267
Death toll: 3,93,310
Active cases: 6,12,868
Total vaccination: 30,79,48,744 pic.twitter.com/0JXZ1weaTK
— ANI (@ANI) June 25, 2021
జూన్ 24 నాటికి దేశవ్యాప్తంగా 39,95,68,448 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,35,781 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.
ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 60,73,912 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 30.79 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 30,79,48,744 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 24.82 కోట్లు ఉండగా, 5.42 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.