COVID-19 in India (Photo Credits: PTI)

New Delhi, June 24: భారత్‌లో కోవిడ్ సెకండ్ వేవ్ వ్యాప్తి నియంత్రణలోకి వస్తుంది, అయితే రోజూవారీ కోవిడ్ కేసులు నిన్నటికంటే ఈరోజు సుమారు 4 వేల మేర పెరిగాయి. అయినప్పటికీ ఈ వారంలో పాజిటివిటీ రేటు 5 శాతానికి లోపే ఉంది, గడిచిన నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు 50 వేలకు అటుఇటుగానే నమోదవుతున్నాయి. ట్రెండ్ ను బట్టి చూస్తే దేశంలో కోవిడ్ వ్యాప్తి రోజురోజుకి తగ్గుముఖంపడుతున్నట్లు స్పష్టమవుతోంది. అలాగే కోవిడ్ రికవరీ రేటు కూడా 96.61 శాతానికి మెరుగుపడింది.

గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 54,069 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు సుమారు 4 వేల మేర పెరిగాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,82,778 చేరింది. నిన్న ఒక్కరోజే 1,321 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,91,981కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 68,885 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,90,63,740 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,27,057 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 96.61% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.08 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.30% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 23 నాటికి దేశవ్యాప్తంగా 39,78,32,667 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 18,59,469 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా  64,89,599 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 30.16 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 30,16,26,028 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 24.82 కోట్లు ఉండగా, 5.34 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.