India's COVID19 Report: భారత్‌లో కొత్తగా 91,702 కోవిడ్ కేసులు మరియు 3,403 మరణాలు నమోదు, గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 1,34,580 మంది రికవరీ
Covid in India(Photo-PTI)

New Delhi, June 11: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసులు లక్షకు దిగువకు పడిపోయాయి, గత నాలుగు రోజులుగా 90 వేలకు అటు ఇటుగా కేసులు నమోదవతూ వచ్చాయి. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఇంకా తగాల్సి ఉంది. అలాగే కోవిడ్ మరణాలలో కూడా గణనీయమైన మార్పులేమి కనిపించడం లేదు. ఒకవైపు చికిత్స తర్వాత కోవిడ్ నుంచి కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటున్నా, మరణాలు మాత్రం అదుపులోకి రాకపోవడం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. దీనిని బట్టి కోవిడ్ చికిత్స మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది.

గడిచిన భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 91,702 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటికంటే కేసులు స్వల్పంగా సుమారు 2 వేల మేర పెరిగాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,74,823 చేరింది. నిన్న ఒక్కరోజే 3,403 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3,63,079కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,34,580 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,77,90,073 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 11,21,671 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 94.93% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 3.83 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.24% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూన్ 10 నాటికి దేశవ్యాప్తంగా 37,42,42,384 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 20,44,131 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 32,74,672 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 24.60 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 24,60,85,649 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 19.85 కోట్లు ఉండగా, 4.75 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.