Supreme Court on Migrant Crisis: వలస కార్మికుల నుండి ఛార్జీలు వసూలు చేయకూడదు, వారికి ఆహారం, నీరు అందించాలి, రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
Migrant workers (Representational Image | Photo Credits: IANS)

New Delhi, May 28: లాక్‌డౌన్ సమయంలో వలస కూలీల సమస్యలపై సర్వోన్నత న్యాయస్ధానం (Supreme Court on Migrant Crisis) స్పందించింది. వారిని క్షేమంగా స్వస్ధలాలకు చేర్చేందుకు ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరింది. రైళ్లు, బస్సుల్లో వలస కార్మికుల (Migrant Workers) నుంచి చార్జీలు వసూలు చేయవద్దని స్పష్టం చేసింది. వలస కూలీల సమస్యలను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు (Supreme Court) వలస కార్మికుల ప్రయాణ చార్జీల భారాన్ని రాష్ట్రాలు భరించాలని, కార్మికులందరికీ ఉచితంగా ఆహారం సరఫరా చేయాలని ఆదేశించింది. ఆహారం ఎక్కడ అందుబాటులో ఉందనే వివరాలను బహిరంగంగా వెల్లడించాలని కోరింది. రెండు రాష్ట్రాల్లో 30 వేల పెళ్లిల్లు వాయిదా, దేశంలో లక్షా యాభై ఎనిమిది వేలు దాటిన కరోనా కేసులు, మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 4531

దీంతో పాటుగా కూలీలు రైళ్లు, బస్సులు దిగిన తర్వాత సంబంధిత రాష్ట్రాలు వారు తమ గ్రామానికి వెళ్లేందుకు రవాణా సదుపాయం, ఆహారాన్ని సమకూర్చాలని కోర్టు పేర్కొంది. వలస కూలీల నమోదును వేగవంతం చేయాలని, మరిన్ని డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కోరింది. రోడ్లపై నడుస్తూ వెళుతున్న వలస కూలీలను సమీపంలోని క్యాంపులకు తీసుకువెళ్లి వారికి అన్ని సౌకర్యాలనూ కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కరోనా మహమ్మారితో అసాధారణ సంక్షోభం తలెత్తిన క్రమంలో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని, వలస కూలీలను స్వస్ధలాలకు చేర్చేందుకు సమన్వయంతో ముందుకెళుతోందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు వివరించారు.

వలసదారుల సంక్షోభంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వు నుండి ఐదు కీలక చర్యలు:

రైలు లేదా బస్సు కోసం ఎటువంటి ఛార్జీలు వలస కార్మికుల నుండి వసూలు చేయకూడదు. ఛార్జీలను రాష్ట్రాలు పంచుకుంటాయి.

వలస కార్మికులకు సంబంధిత రాష్ట్రం మరియు యుటి ద్వారా ఆహారాన్ని అందించాలి.

రైలు ద్వారా ప్రయాణించేటప్పుడు ఆయా రాష్ట్రాలు భోజనం మరియు నీటిని అందించాలి. రైలులో భోజనం మరియు నీటిని అలాగే బస్సుల్లో కూడా ఆహారం, నీరు అందించాలి.

వలసలు మరియు రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌ను ఆయా రాష్ట్రాలు పర్యవేక్షించాలి, రిజిస్ట్రేషన్ తరువాత, వీలైనంత త్వరగా రవాణాకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలి.

వలస కార్మికులు రోడ్లపై నడుస్తున్నట్లు గుర్తించిన వెంటనే వారిని ఆశ్రయాలకు తీసుకెళ్ళి ఆహారం మరియు అన్ని సౌకర్యాలు కల్పించాలి.

వలసదారులు ఇంటికి చేరుకునే ముందు వరకు ఆహారం, నీరు మరియు ప్రాథమిక సౌకర్యాలు ఉండేలా చూడాలని సుప్రీం కోర్టు కేంద్రానికి తెలిపింది. ఉపశమన శిబిరాల్లో వలస వచ్చినవారికి ఆహారం లభిస్తుందని, అయితే లాక్డౌన్ కారణంగా అద్దె ప్రాంగణంలో ఉన్నవారు బాధపడుతున్నారని సుప్రీం కోర్టు పేర్కొంది.