NITI Aayog Reacts to KCR: కేసీఆర్ వ్యాఖ్యలకు నీతి ఆయోగ్ కౌంటర్,ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరం, అందరితో చర్చించేందుకే నీతి ఆయోగ్ మీటింగ్, కేసీఆర్ ఆరోపణల్లో నిజాలు లేవంటూ వివరణ
నీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM Kcr) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రకటించింది ఆ సంస్థ. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి (NITI Aayog meeting) సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. శనివారం సాయంత్రం జరిగిన ప్రెస్మీట్లో కేంద్రంతోపాటు, నీతి ఆయోగ్పై సీఎం కేసీఆర్ (CM kcr) తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
New Delhi, AUG 07: నీతి ఆయోగ్ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ (CM Kcr) చేసిన ఆరోపణల్లో నిజం లేదని ప్రకటించింది ఆ సంస్థ. ఆదివారం జరిగే నీతి ఆయోగ్ పాలక మండలి (NITI Aayog meeting) సమావేశంలో పాల్గొనకూడదని కేసీఆర్ నిర్ణయించడం దురదృష్టకరమని నీతి ఆయోగ్ వ్యాఖ్యానించింది. శనివారం సాయంత్రం జరిగిన ప్రెస్మీట్లో కేంద్రంతోపాటు, నీతి ఆయోగ్పై సీఎం కేసీఆర్ (CM kcr) తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలను నీతి ఆయోగ్ ఖండించింది. ఈ అంశంపై ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్.. దేశంలోని అత్యున్నత రాజకీయ నాయకత్వం ఉండే వేదిక. రాష్ట్ర స్థాయిలలో కీలకమైన అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై చర్చించి, జాతీయ అభివృద్ధికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే వేదిక. బలమైన రాష్ట్రాలు, బలమైన దేశాన్ని తయారు చేయాలనే ఉద్దేశ్యంతో నీతి ఆయోగ్ ఒక సంస్థగా ఏర్పాటైంది. రాష్ట్రాలతో సన్నిహితంగా పని చేసేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపట్టాం. గత సంవత్సరంలోనే నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్/సభ్యులు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో 30కి పైగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలతో రాష్ట్రాలకు ఉన్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయి.
నీతి ఆయోగ్ కేంద్ర-రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి మార్గం సుగమం చేసింది. రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సమస్యలపై చర్చించేందుకు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం గతేడాది జనవరి 21న హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసింది. ఇటీవల నీతి ఆయోగ్ సమావేశానికి విజ్ఞప్తి చేసినప్పటికీ, ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదు. కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా జాతీయ ప్రాధాన్యం కలిగిన అన్ని సమస్యలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. పాలక మండలి సమావేశానికి సన్నాహకంగా, తెలంగాణతో సహా కేంద్రం-రాష్ట్రాల మధ్య వివరణాత్మక సంప్రదింపులు జరిగాయి. సమావేశానికి అనుసంధానంగానే జూన్ నెలలో ధర్మశాలలో ప్రధాని మోదీ.. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సమావేశమయ్యారు. తెలంగాణ ప్రధాన కార్యదర్శితో సహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఎజెండా తయారీలో రాష్ట్రాలు సహకరించడం లేదన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఆరోపణ సరికాదు. నీటి రంగానికి సంబంధించి, 4 సంవత్సరాలుగా భారత ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రానికి ‘జల్ జీవన్ మిషన్’ కింద రూ.3982 కోట్లను కేటాయించింది. తెలంగాణ అందులో కేవలం రూ.200 కోట్లు మాత్రమే వినియోగించింది. 2014-2022 మధ్య కాలంలో తెలంగాణకు పీఎమ్కేఎస్వై, ఏఐబీపీ, సీఏడీడబ్ల్యూఎమ్ కింద రూ.1195 కోట్లు విడుదల చేసింది. జాతీయ ప్రాధాన్యం కలిగిన ఫ్లాగ్షిప్ స్కీమ్లు/కార్యక్రమాలతో సహా ఆర్థిక విషయాలలో భారత ప్రభుత్వం రాష్ట్రాలకు స్థిరంగా మద్దతిస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద నిధుల కేటాయింపు గణనీయంగా పెరిగింది. పద్నాలుగో ఆర్థిక సంఘం నిధుల్ని 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. సీఎస్ఎస్ కింద కేటాయించిన నిధుల వినియోగానికి తగినంత సౌలభ్యం కూడా కల్పించింది’’ అని నీతి ఆయోగ్ తన ప్రకటనలో పేర్కొంది.
(The above story first appeared on LatestLY on Aug 07, 2022 01:06 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

