Ostracised in death: మీ కులం పిచ్చి తగలెయ్యా! తక్కువ కులం డాక్టర్ పోస్టుమార్టం చేశాడని అంత్యక్రియలకు దూరంగా ఉన్న గ్రామం, బైక్ మీద తీసుకెళ్లి అంత్యక్రియలు చేసిన సర్పంచ్, మృతుడి భార్య గర్భంతో ఉందనే కనికరం కూడా చూపని బంధువులు
కింది కులానికి చెందిన వైద్యుడు పోస్ట్మార్టం నిర్వహించాడని తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు.. అంత్యక్రియలకు రావడానికి ముందుకు రాలేదు. సరి కదా.. శవాన్ని చూసేందుకు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ ముందుకు వచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు.
Bhuvaneswar, SEP 25: కంప్యూటర్ యుగమైనప్పటికీ కులం తక్కువ వారంటూ మనుషుల్ని వెలేయడం మన దేశంలో సర్వసాధారణమే. దళితులు (Dalits) ముట్టుకున్నారని విలువైన వస్తువుల్ని సైతం పడేయడం, కాల్చేయడం వంటి అనేక దుర్మార్గాలు ఈ సమాజంలో ఎప్పటి నుంచో భాగమయ్యాయి. తాజాగా ఓ శవాన్ని(Dead body) వెలేశారు. అది దళితుడి శవమేం కాదు.. కాకపోతే ఒక దళిత డాక్టర్ (Dalit doctor) ఆ శవానికి పోస్ట్మార్టం(autopsy ) చేశాడు. తక్కువ కులం వ్యక్తి తాకాడని ఏకంగా బంధువులే ఇంతటి దారుణానికి ఒడిగట్టారు..ఒడిశా (Odisha) రాష్ట్రంలోని బర్ఘా జిల్లాలో జరిగిందీ ఘటన..ముచును సంధ (Muchunu Sandha) అనే వ్యక్తి రోజు కూలి. సంధ భార్య గర్భిణి. వారికి మూడేళ్ల కూతురు ఉంది. లివర్ సంబంధిత వ్యాధితో కొంత కాలంగా బాధపడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆరోగ్యం విషమించడంతో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మరణించాడు.
కాగా, అతడికి పోస్ట్మార్టం పూర్తి చేసి అంబులెన్సులో అతడి స్వగ్రామానికి శుక్రవారం తరలించారు. శవాన్ని ఇంట్లో దిగబెట్టారు.. అయితే సంధకు కింది కులానికి చెందిన వైద్యుడు పోస్ట్మార్టం నిర్వహించాడని తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు.. అంత్యక్రియలకు (Funeral) రావడానికి ముందుకు రాలేదు. సరి కదా.. శవాన్ని చూసేందుకు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆ గ్రామ సర్పంచ్ (Sarpanch) ముందుకు వచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యాడు. చాపలో శవాన్ని చుట్టి తన బైకు మీద తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. అంతే కాదు.. సంధ మృతదేహాన్ని తీసుకువచ్చిన అంబులెన్సుకు చందాలు వసూలు చేసి చార్జీలు చెల్లించాడు.
‘ఈ రోజుల్లో కులమెక్కడిదండీ?’ అంటూ సోషల్ మీడియాలో బయటా ఇప్పటికీ చాలా అతిశయోక్తులు వినిపిస్తుంటాయి. మన దృష్టిని కాస్త కేంద్రీకరిస్తే ఇలాంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకు కొన్ని వందలు కనిపిస్తుంటాయి. పాలకులు తమ రాజకీయాల కోసం వీటికి అంతిమ పరిష్కారం చూపడం లేదు. ప్రజలే చొరవ తీసుకుని తమ మనసుల్లో నుంచి ఈ సమాజం నుంచి దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
(The above story first appeared on LatestLY on Sep 25, 2022 10:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

