Ayodhya Ram Mandir: రఘురాముడు నడయాడిన అయోధ్య వైపే అందరి చూపు, నేడు మధ్యాహ్నం రామ మందిర్ భూమిపూజ కార్యక్రమం, అద్భుత ఘట్టం మొత్తం ప్రత్యక్ష ప్రసారం
Ayodhya on eve of Ram Mandir Bhumi Pujan | (Photo Credits: Twitter/@ShriRamTeerth)

Ayodhya, August 5: దేశ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టానికి (Ram Mandir Bhumi Pujan) కొద్ది గంటల్లో పునాది రాయి పడనుంది. రఘురాముడి జన్మస్థలమైన అయోధ్యలో (Lord Rama Birth Place) రామాలయ నిర్మాణానికి నేడు మధ్యాహ్నం భూమిపూజ జరుగనుంది. ప్రధాని మోదీ (PM Modi) స్వయంగా హాజరై.. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకతో ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లదాకా.. అంటే 32 సెకన్లలోపు భూమి పూజ కార్యక్రమం పూర్తి కానుంది. ఇప్పటికే శంకుస్థాపనకు సన్నాహాలు పూర్తయ్యాయి. సోమవారమే మొదలైన పూజలు.. భూమిపూజతో బుధవారం మధ్యాహ్నం పూర్తి కానున్నాయి. అయోధ్య రామ మందిరం నమూనా ఇదే, భారతీయ వాస్తుశిల్పకతకు అద్దంపట్టేలా రామమందిర్ నిర్మాణం

భూమి పూజ కార్యక్రమానికి అయోధ్య పట్టణం (Ayodhya Ram Mandir) సర్వాంగ సుందరంగా సిద్ధమయింది. బారికేడ్లు, బలగాలతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పలువురు స్థానికులు తమ ఇళ్లకు, దుకాణాలకు కొత్త రంగులు వేసుకున్నారు. పలు చోట్ల భజన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి 175 మందిని మాత్రమే ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఉదయం పట్టణానికి చేరుకుని, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అయోధ్య వివాదంపై అత్యున్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు 

రామాలయం భూమి పూజ సందర్భంగా ప్రధాని మోదీ 3 గంటల పాటు అయోధ్యలో గడపనున్న నేపథ్యంలో యూపీ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని బుధవారం ఉదయం 11.30 గంటలకు అయోధ్యలని సాకేత్ కళాశాల హెలిప్యాడ్ లో దిగినపుడు ఆయనకు కరోనా నుంచి కోలుకున్న 150 మంది ప్రత్యేక పోలీసు యోధులతో రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసినట్లు యూపీ పోలీసు డీఐజీ చెప్పారు.

Visuals Shared by Ram Mandir Trust:

కరోనా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో.. కార్యక్రమం జరిగే ప్రాంతానికి ఎవరూ రావద్దని స్థానికులకు అధికారులు విజ్ఞప్తి చేశారు. అలాగే, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎవరూ అయోధ్యకు రావద్దని కోరారు. మొత్తం శంకుస్థాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం జరుపుతామని, ప్రజలంతా ఇళ్లలోనే ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలని అభ్యర్థించారు. అయోధ్యకు వెళ్లే రహదారులకు ఇరువైపులా రామ మందిర నమూనా చిత్రాలను, రామ్‌లల్లా చిత్రాలను అలంకరించారు. అయోధ్య కేసుపై చారిత్రాత్మక తీర్పు, అయోధ్య ట్రస్టుకు వివాదాస్పద భూమిని కేటాయించాలి

అయోధ్యలోని హనుమాన్‌ గఢీ ఆలయ ప్రాంతం మంగళవారం పోలీసు సైరన్లతో, ఆలయం నుంచి వినిపించే భజనలతో హోరెత్తిపోయింది. ఆ ఆలయాన్ని బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. పోలీసులు అయోధ్యకు వెళ్లే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. ప్రయాణికుల మొబైల్‌ నంబర్‌ సహా ప్రతీ వివరం తెలుసుకుంటున్నారు. కోవిడ్‌–19 ప్రొటోకాల్‌ను అందరూ పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని సీనియర్‌ ఎస్పీ దీపక్‌ కుమార్‌ తెలిపారు. అయోధ్య కేసులో ఆది నుంచి ఏం జరిగింది?కోర్టు తీర్పులు ఎలా వస్తూ వచ్చాయి?రాజకీయాలకు కీలక అంశంగా ఎలా మారింది?

ఆహ్వానం లేకుండా బయటివ్యక్తులెవరూ అయోధ్యలో అడుగుపెట్టకుండా చూసుకుంటున్నామన్నారు. అలాగే, పట్టణంలో నలుగురికి మించి గుమికూడకుండా ఆంక్షలు విధించామని తెలిపారు. బయటివారెవరూ పట్టణంలో లేరని నిర్ధారించుకునేందుకు.. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని వివరించారు. భూమి పూజ మినహా పట్టణంలో మరే ఇతర మతపరమైన కార్యక్రమం నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. అయితే, ఆలయాలు, మసీదులు, ప్రార్థనామందిరాలు తెరిచే ఉంటాయి. 6 లక్షల దీపాల వెలుగుల్లో అయోధ్య, గిన్నిస్ రికార్డు సాధించిన అయోధ్య దీపోత్సవం, దీపాలతో వెలుగులు విరజిమ్మిన సరయూ నదీ తీరం

అయోధ్య కార్యక్రమం కన్నాముందు ప్రధాని మోదీ హనుమాన్‌ గఢీ ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటారని తెలిపింది. ‘అక్కడి నుంచి శ్రీ రామ జన్మభూమికి వెళ్లి అక్కడ భగవాన్‌ శ్రీ రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ను దర్శించుకుని, పూజలు నిర్వహిస్తారు’ అని పీఎంఓ వెల్లడించింది. ఆ ప్రాంగణంలో ఒక పారిజాత మొక్కను కూడా నాటుతారని పీఎంఓ తెలిపింది. ఆ తరువాత భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారని వివరించింది. భూమి పూజ సందర్భంగా శిలాఫలకాన్ని, స్మారక పోస్టల్‌ స్టాంప్‌ను ప్రధాని ఆవిష్కరిస్తారని తెలిపింది. బాబ్రీ మసీదుకు వేరే స్థలం

ప్రధాని మోదీ రాకను పురస్కరించుకుని అయోధ్యలోని ప్రముఖ హనుమాన్‌ గఢీ ఆలయంలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రామ మందిరం భూమిపూజకు ముందుగా ప్రధాని హనుమాన్‌ ఆలయంలో పూజలు చేయనున్నారు. శ్రీరాముడి దర్శనానికి ముందుగా ఎవరైనా రామభక్త ఆంజనేయుడికి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, కరోనా వైరస్‌ ప్రొటోకాల్‌ కారణంగా తాము ప్రధానితో మాట్లాడేందుకు కూడా అవకాశం లేదని ఆలయ పూజారి మహంత్‌ రాజు దాస్‌ తెలిపారు. 30 ఏళ్ల క్రితమే రామ్ మందిర్ డిజైన్, వీహెచ్‌పీ వినతి మేరకు ఆకృతి చూపిన చంద్రకాంత్‌ సోంపురా

72 మెట్లుండే హనుమాన్‌ గఢీ ఆలయం ఉత్తర భారతంలో అత్యంత ప్రముఖమైందిగా పేరు. ఈ ఆలయంలో బాల ఆంజనేయుడు తన తల్లి అంజనీ దేవి ఒడిలో కూర్చుని ఉంటాడు. రావణుడిపై విజయం సాధించిన అనంతరం శ్రీరాముడు ఈ ప్రదేశాన్ని ఆంజనేయుడు నివసించేందుకు ఇచ్చాడు. అందుకే దీనిని హనుమాన్‌ గఢీ లేదా హనుమాన్‌ కోట్‌ అంటారు.

భూమిపూజ కార్యక్రమానికి ఆలయ ట్రస్టు 175 మందికి ఆహ్వానాలు పంపించింది. వీరిలో వివిధ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు చెందిన 135 మంది సాధువులు ఉన్నారు. బీజేపీ కురువృద్ధ నేతలు ఎల్‌కే అద్వాణీ, మురళీ మనోహర్‌ జోషి, న్యాయవాది పరాశరన్‌ తదితర ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన మీదటే ఆహ్వాన జాబితా రూపొందించినట్లు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌ తెలిపారు. తమిళనాడు నుంచి వచ్చిన సాధువులు శ్రీరామ్‌ అని తమిళంలో రాసి ఉన్న 5 కిలోల బరువైన బంగారు ఇటుక, 20 కిలోల వెండి ఇటుకను ఆలయ ట్రస్టుకు బహూకరించారని ఆయన వెల్లడించారు.

అయితే కరోనా నేపథ్యంలో బీజేపీ వృద్ధ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ అయోఽధ్యకు రావడం లేదు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తారు. పద్మశ్రీ షరీఫ్‌ చాచా అలియాస్‌ మొహమ్మద్‌ షరీఫ్ ను కూడా భూమిపూజకు ఆహ్వానించారు. సైకిల్‌ మెకానిక్‌ అయిన 82 ఏళ్ల షరీఫ్‌.. గత 27 ఏళ్లలో వందల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మానవతావాదికి ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే తన తండ్రి భూమిపూజకు వెళ్లేది అనుమానమేనని ఆయన కుమారుడు సగీర్‌ చెప్పారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం అలా్ట్ర సౌండ్‌ టెస్టులు జరుగుతున్నాయి.

మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ తరఫున 11 వెండి ఇటుకలను ఆలయ నిర్మాణానికి పంపుతున్నట్టు ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, మాజీ సీఎం కమల్‌నాథ్‌ తెలిపారు. బుధవారం ఆయన తన ఇంట్లో హనుమాన్‌ చాలీసా పఠనం నిర్వహిస్తున్నారు. విదేశాల్లోనూ భూమిపూజ కార్యక్రమాన్ని ఉత్సవంగా నిర్వహిస్తున్నారు. అమెరికాలోని అన్ని హిందూ ఆలయాల్లో బుధవారం దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు హిందూ మందిర్‌ ఎగ్జిక్యూటివ్స్‌ కాన్ఫరెన్స్‌, హిందూ మందిర్‌ ప్రీస్ట్స్‌ కాన్ఫరెన్స్‌ ప్రకటించాయి.

ప్రధాని షెడ్యూల్ ఇదే

బుధవారం ఉ.9.35 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ప్రధాని

10.35 గంటలకు లక్నో విమానాశ్రయానికి

10.40 గంటలకు హెలికాప్టర్‌లో అయోధ్యకు

11.30 గంటలకు అయోధ్యలోని సాకేత్‌ విమానాశ్రయానికి

11.40 గంటలకు హనుమాన్‌ గర్హిలో పూజలు

12 గంటలకు రామజన్మభూమిలో రామ్‌లల్లా దర్శనం

12.15 గంటలకు ప్రతిపాదిత ఆలయ ప్రాంగణంలో మొక్క నాటుతారు

12.30 గంటలకు భూమిపూజ ప్రారంభం

12.40 గంటలకు భూమిపూజ పునాదిరాయి పూజ

1.10 గంటలకు స్వామి నృత్యగోపాల్‌ దాస్‌ తదితర రామజన్మభూమి ట్రస్టు సభ్యులతో సమావేశం

2.05 గంటలకు అయోధ్య నుంచి హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం

2.20 గంటలకు లక్నో నుంచి ఢిల్లీకి ప్రయాణం.