Tamil Nadu Rains: తీరాన్ని తాకిన వాయుగుండం, గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, భారీ వర్షాలకు తమిళనాడులో 14 మంది మృతి, రాగల 24 గంటల్లో తమిళనాడు, ఏపీలో కుండపోత వర్షాలు
గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం ఎట్టకేలకు తీరాన్ని తాకింది. ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా పయనించి, గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, మధ్య చెన్నై సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు
Chennai, Nov 11: గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం ఎట్టకేలకు తీరాన్ని తాకింది. ఐఎండీ వాతావరణ సూచనల ప్రకారం నైరుతి, పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా పయనించి, గురువారం సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర, మధ్య చెన్నై సమీపంలో తీరం దాటిందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.
వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వర్షం, ఈదురు గాలులు కారణంగా చెన్నై విమానాశ్రయకు విమానాలను రద్దు (Chennai airport suspends arrivals) చేశారు. హైదరాబాద్, ముంబై, కోల్కతాకు విమానాలను మళ్లించారు. తమిళనాడులో ఎడతెరిపిలేకుండా (Tamil Nadu Rains) కురుస్తున్న వర్షాల ధాటికి 14 మంది మృతి (At least 14 dead in Tamil Nadu rain) చెందారు. తమిళనాడు వ్యాప్తంగా చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.
వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. ఉభయగోదావరి, కర్నూలు, అనంతపురం కృష్ణ గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచనతో పాటు, కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కన్నబాబు అన్నారు.
తిరుపతిలో అనేక ప్రాంతాల్లో ఈదురుగాలులో వీస్తున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. పలుచోట్ల భారీ వృక్షాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో అధికారులు వాహన దారులను, స్థానికులను అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచనలతో.. భారీ వర్షాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేస్తున్నామని మంత్రి అన్నారు.
అత్యవసర సహాయక చర్యల కోసం చిత్తూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్, 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నెల్లూరు జిల్లాకు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం పంపించామని తెలియజేశారు. శనివారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
(The above story first appeared on LatestLY on Nov 11, 2021 06:40 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

