Telangana Lokayukta:  తెలంగాణ లోకాయుక్తగా హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి సీవీ రాములు, మానవ హక్కుల సంఘం చైర్మన్‌గా జి. చంద్రయ్యలను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆమోదం తెలిపిన గవర్నర్
Telangana Lokayukta | Photo: Wikimedia Commons

Hyderabad, December 20:  తెలంగాణ లోకాయుక్త (Lokayukta), ఉప లోకాయుక్త  (Upa Lokayukta) మరియు మానవ హక్కుల కమీషన్లను రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt)  నియమించింది. తెలంగాణ లోకయుక్తాగా హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సీవీ రాములు (CV Ramulu) , ఉప లోకాయుక్తగా రాష్ట్ర న్యాయశాఖ మాజీ కార్యదర్శి నిరంజన్ రావు, మరియు మానవ హక్కుల కమీషన్ చైర్మన్ గా హైకోర్ట్ రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్యలు నియమితులయ్యారు.

ప్రగతి భవన్‌లో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ లోకాయుక్త, ఉప లోకాయుక్త పేర్లను ఖరారు చేసింది. ఈ కమిటీలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష సభ్యులుగా మజ్లిస్ పార్టీకి చెందిన పాషా ఖాద్రీ,  శాసన మండలి నుంచి జాఫ్రీ ఉన్నారు.

ఇక రాష్ట్ర హోంమంత్రి నేతృత్వంలో గల కమిటీ రాష్ట్ర మాన వహక్కుల చైర్మన్ గా బి. చంద్రయ్యను మరియు సభ్యులుగా ఎన్. ఆనందరావు, మొహమ్మద్ ఇర్ఫాన్ మోయినుద్దీన్ లను నియమించింది.

కమిటీ చేసిన సిఫారసులను గవర్నర్ తమిళైసై సౌందరాజన్ ఆమోదించారు.

లోకాయుక్త మరియు ఉప లోకాయుక్తల పదవీకాలం ఐదేళ్లు కాగా, మానవహక్కుల సంఘం చైర్మన్ మరియు సభ్యుల పదవీకాలం మూడేళ్లుగా ఉండనుంది.