CBN slams Jagan: 'పులివెందుల పంచాయితీలు రాష్ట్రంలో చేయనివ్వం' ! ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబు వార్నింగ్, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, తన నలభైయేళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి అరాచకాలు చూడలేదని జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు.

మంగళవారం విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు, ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ప్రజల స్వేచ్ఛను హరించేలా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ప్రజలు తిరుగుబాటు చేసే పరిస్థితి తెచ్చుకోవద్దని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. టీడీపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేసి, జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమపై 469 దాడులు జరిగాయి, 8 మంది టీడీపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారని చంద్రబాబు తెలిపారు. అధికార పార్టీ దాడులు చేస్తున్నా పోలీసులు ఉదాసీనంగా వ్యహరించడం తగదన్నారు.

వైసీపీ ప్రభుత్వం బాగా పనిచేస్తే నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిద్దామనుకున్నాం కానీ, జగన్ ప్రభుత్వం విధ్వంసక పాలన చేస్తుండటంతో ఇక తిరుగుబాటు తప్పదని ఆయన స్పష్టం చేశారు.

ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యంత దారుణంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాట్లాడితే తాము 150 మంది ఉన్నామని, తాము లేస్తే ఒక్కరు మిగలరని అసెంబ్లీ సాక్షిగా బెదిరింపులకు దిగుతున్నారు. జగన్ పులివెందుల పంచాయితీలు రాష్ట్రంలో చేయనివ్వం అని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు.

తమ హయాంలో ఉచిత ఇసుక పాలసీని తెస్తే, ఈ ప్రభుత్వం ఇసుకను అధిక ధరకు విక్రయిస్తుంది. దీనిని బట్టి ఇసుక దోపిడి ఎవరు చేస్తున్నారో అర్థమవుతుందన్నారు. పేదలకు 5 రూపాయలకే అన్నం పెట్టే 'అన్న క్యాంటీన్' లను మూసివేశారు, తాము ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను జగన్ రద్దు చేశారని వీటన్నిటిపై పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రతిపక్షనేత వెల్లడించారు.

జగన్- కేసీఆర్ ఇద్దరు కలిసి ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారు. తమ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారు. తెలంగాణ భూభాగం నుంచి గోదావరి నీటిని తీసుకొచ్చి శ్రీశైలానికి ఇవ్వటం అన్యాయం. ఇది ప్రజల భావోద్వేగానికి సంబంధించిన విషయం అని చంద్రబాబు అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తమ స్వార్థమైన ఆలోచనలతో ఏపీకి నష్టం కలిగించొద్దు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇక ఊరుకోం అని చంద్రబాబు హెచ్చరించారు.