Haryana CM Manohar Lal Khattar: మరోసారి సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్, ఉపముఖ్యమంత్రిగా దుష్యంత్ చౌతాలా, 57కు చేరిన బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సంఖ్య, నేడే ప్రమాణ స్వీకారం
haryana government Manohar Lal Khattar to be Haryana CM again, to meet governor (Photo-IANS)

Chandigarh, October 27: హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ఈసారి హంగ్ సర్కార్ రాబోతోంది. మెజార్టీ సీట్లు దక్కించుకోలేకపోయిన బీజేపీ జననాయక్ జనతా పార్టీ (JJP)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ మనోహర్ లాల్ ఖట్టర్, జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలాతో కూడిన బృందం నిన్న గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ను కలిసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ బీజేపీని ఆహ్వానించారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం 2.15 నిమిషాలకు రాజ్ భవన్ లో ముఖ్యమంత్రిగా ఖట్టర్ ప్రమాణం చేయనున్నారు.

బీజేపీకి మద్ధతు ఇస్తున్న దుష్యంత్ చౌతాలా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇద్దరు నేతలతో గవర్నర్ సత్యదేవ్ నారాయణ్‌ ప్రమాణం చేయించనున్నారు. దీంతో మరోసారి సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం చేస్తారు. దీంతో పాటుగా కొందరు మంత్రుల పేర్లను ఇవాళ ప్రకటిస్తారని సమాచారం.

మరోసారి సీఎంగా మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రమాణస్వీకారం

అసెంబ్లీ ఎన్నికల్లో 40 స్థానాలు గెలుచుకున్న బీజేపీ 10 సీట్లు సాధించిన జేజేపీ మద్ధతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ఇస్తుండటంతో..బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సంఖ్య 57కు చేరింది. ప్రమాణం స్వీకారం అనంతరం ఇరు పార్టీల నేతలతో చర్చించి మంత్రివర్గ విస్తరణ చేపడతామని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. హర్యానాలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు గొప్ప అవకాశం కలిగిందని దుష్యంత్ చౌతాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గవర్నర్ హౌస్ వద్ద కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్

వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. దీపావళి పర్వదినాన..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనందించదగ్గ విషయమన్నారు. బీజేపీ, జేజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. సిద్ధాంతపరంగా భిన్న వైరుధ్యం కలిగిన బీజేపీతో జేజేపీ కలవడాన్ని అనైతికమని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 సీట్లు , ఇండిపెండెంట్లు, ఇతరులు మిగతా 10 సీట్లు గెలిచారు. కాగా తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించినప్పటికీ ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది. అయినప్పటికీ స్వతంత్రుల మద్దతు బీజేపీకే కొనసాగనుంది.