Shiv Sena Symbol Row: మహారాష్ట్రలో వేడెక్కిన రాజకీయం, ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఉద్ధవ్ టీం, సంజయ్ రౌత్ రూ. 2000 కోట్ల వ్యాఖ్యలపై కేసు నమోదు
Uddhav Thackeray (Photo Credits: ANI)

Mumbai, Feb 20: శివసేన గుర్తుపై (Shiv Sena Symbol Row) మహారాష్ట్రలో మళ్లీ రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ఎన్నికల సంఘం శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తును మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గానికి కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సుప్రీంకోర్టును (Uddhav Thackeray Faction Moves Supreme Court) ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకోకుండానే ఈసీ నిర్ణయం తీసుకుందని, శివసేన మెజారిటీ కార్యకర్తలు తమవెంటే ఉన్నారని పిటిషన్లో పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను వీలనైంత త్వరగా విచారించాలని ఠాక్రే తరఫు న్యాయవాది ఏఎం సింఘ్వీ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే న్యాయస్థానం మాత్రం ఈ పిటిషన్ ఇవాల్టి లిస్టింగ్‌లో లేదని మంగళవారం సరైన ప్రక్రియతో రావాలని తెలిపింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde Group) కూడా సుప్రీంకోర్టును ముందుగానే ఆశ్రయించారు. శివసేన గుర్తు కేటాయింపుపై ఎన్నికల సంఘం నిర్ణయాన్ని ఠాక్రే సవాల్ చేయవచ్చని, దీనిపై ఆదేశాలు ఇచ్చే ముందు మహారాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయన్ని తీసుకోవాలని కోరారు.

గౌతం అదానిని ఆవుతో పోల్చిన సంజయ్ రౌత్, బీజేపీకి అదానీ పవిత్ర గోవు అని హగ్ చేసుకోవాలని సెటైర్, మిగిలిన ఆవులను మనకు వదిలిపెట్టారని చమత్కారం

కాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఏక్‌నాథ్‌ షిండేపై రాజ్యసభ సభ్యుడు సంజయ్‌రౌత్‌ (Sanjay Rout) సంచలన ఆరోపణలు చేశారు.షిండే వర్గం శివసేన పేరును, పార్టీ గుర్తు విల్లు-బాణాన్ని సంపాదించేందుకు రూ. 2000 కోట్లు లంచంగా ముట్టజెప్పిందని ఆరోపించారు. ఈ మొత్తం ప్రాథమిక అంచనా మాత్రమేనని, ఇంతకంటే ఎక్కువే చేతులు మారి ఉంటుందని ఆదివారం ట్వీట్‌ చేశారు. ‘శివసేన పేరు, గుర్తు కోసం రూ.2000 కోట్లు చేతులు మారినట్టు నా వద్ద విశ్వసనీయ సమాచారం ఉన్నది. త్వరలో చాలా విషయాలు బయటకు వస్తాయని అన్నారు.

ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన సీఎంగా ఉన్నప్పుడు ఏక్‌నాథ్‌ షిండే పార్టీని చీల్చి ఉద్ధవ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ మద్దతుతో సీఎం పదవి దక్కించుకొన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఉద్ధవ్‌, షిండే వర్గాలు పార్టీ పేరు, గుర్తుల కోసం పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలైన శివసేన షిండే వర్గమేనని, పార్టీ గుర్తు అయిన విల్లు-బాణం ఆ వర్గానికే చెందుతాయని ఎన్నికల సంఘం గత శుక్రవారం ప్రకటించింది. ఎన్నికల గుర్తు అయిన మండుతున్న కాగడాను ఉద్ధవ్‌ వర్గానికి కేటాయించింది. అది కూడా త్వరలో జరుగనున్న రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల వరకేనని తేల్చి చెప్పింది. ఈ ప్రకటనతో మహాలో రాజకీయం వేడెక్కింది.ఈసీపై ఉద్ధవ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన పార్టీ పేరును, గుర్తులను చోరీ చేశారని ఆరోపించారు.

శివసేన పార్టీపేరు, గుర్తు కోసం రూ. 2వేల కోట్ల డీల్, సంచలన విషయాలు బయటపెట్టిన ఉద్దవ్ వర్గం ఎంపీ, ఈవీఎం ట్యాంపరింగ్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడి

సీఎం పదవి కోసం ఉద్ధవ్‌ఠాక్రే సిద్ధాంతపరంగా బద్ద విరోధులైనవారి కాళ్లపై పడ్డారన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా విమర్శలను సంజయ్‌ రౌత్‌ తిప్పికొట్టారు. ఇప్పుడు ఏక్‌నాథ్‌ షిండే ఎవరి కాళ్లపై పడ్డారని ప్రశ్నించారు. ‘ఇప్పుడు షిండే ఎవరికాళ్లపై పడ్డారు. అమిత్‌ షా వ్యాఖ్యలను మహారాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. ప్రస్తుత సీఎంకు ఛత్రపతి శివాజీ పేరును కూడా ఉచ్ఛరించే అర్హత లేదు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

పార్టీ పేరు కోసం లంచాలు ఇచ్చారన్న రౌత్‌ ఆరోపణలను షిండే వర్గంతోపాటు బీజేపీ తోసి పుచ్చాయి.రౌత్‌ ఆరోపణలను షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సదా సర్వాంకర్‌తో పాటు మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత సుధీర్‌ మున్‌గంటీవార్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆశిష్‌ షెలార్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు. డీల్‌ జరిగిందని చెప్పడానికి రౌత్‌ ఏమైనా క్యాషియరా? అని సర్వాంకర్‌ ప్రశ్నించారు. రౌత్‌ ఆరోపణలు సుప్రీం కోర్టు, ఈసీ వంటి స్వతంత్ర సంస్థలను అపఖ్యాతి పాల్జేసే ప్రయత్నమని సుధీర్‌ మండిపడ్డారు. మతిభ్రమించిన వ్యక్తులే ఇలాంటి ఆరోపణలు చేస్తారని షెలార్‌ విమర్శించారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి ఉద్ధవ్ ఠాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్‌పై నాసిక్‌లో ఫిర్యాదు నమోదైంది