West Bengal Assembly Elections 2021: ఎదురులేని దీదీ, మ్యాజిక్ ఫిగర్ క్రాస్, బీజేపీ భారీగా వెనుకంజ, కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల అడ్రస్ గల్లంతు, నందిగ్రాంలో దూసుకుపోతున్న మమత, బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటాన‌ని తెలిపిన పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్‌
File image of West Bengal CM Mamata Banerjee (Photo Credit: File Photo)

Kolakata, May 2: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (West Bengal Assembly Elections 2021) ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తిని కనపరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ (TMC), ప్రతిపక్ష బీజేపీ (BJP) హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం అధికార టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది.

మొత్తం 292 స్థానాలకు గాను అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే 146 స్థానాలు కావాల్సి ఉండగా ప్రస్తుతం దీదీ పార్టీ 190 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే నందిగ్రాం నుంచి బరిలో నిలిచిన పార్టీ అధినేత మమతాబెనర్జీ (Mamatha Benarji)  అయిదు రౌండ్లలో వెనుకంజలో ఉన్నారు.  ఆరవ రౌండ్ లో అనూమ్యంగా దూసుకువచ్చారు. సువేదు అధికారిపై ఇప్పటిదాకా దాదాపు 8వేలకుపైగా ఓట్ల  వెనుకంజలో ఉన్న మమత 6వ రౌండ్‌లో 1427ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ప‌శ్చిమ బెంగాల్‌లో బీజేపీ ఓడిపోతే పూర్తి బాధ్యత తానే తీసుకుంటాన‌ని అన్నారు ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ దిలీప్ ఘోష్‌. అయితే ట్రెండ్స్ ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను తేల్చ‌వ‌ని, ఇప్ప‌టికీ తాము గెలుస్తామ‌న్న ఆశాభావం ఉన్న‌ద‌ని ఆయ‌న అన్నారు. కౌంటింగ్ ఇంకా కొన‌సాగుతోంది చూద్దాం అని దిలీప్ ఘోష్ చెప్పారు. మ‌రోవైపు టోలీగంజ్‌లో బీజేపీ అభ్య‌ర్థి బాబుల్ సుప్రియో వెనుకంజ‌లో ఉన్నారు. దీనిపై ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలాష్ విజ‌య్‌వ‌ర్ఘియా స్పందించారు.

తమిళనాడులో భారీ మెజార్టీ దిశగా స్టాలిన్ డీఎంకే పార్టీ, వెనుకంజలో అధికార పార్టీ అన్నాడీఎంకే, స్వల్ప ఆధిక్యంలో దూసుకువెళుతున్న మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్‌హాసన్

టోలీగంజ్‌లో బాబుల్ వెనుకంజలో ఉండ‌టం న‌న్ను ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. అయితే ఇప్పుడే ఏమీ చెప్ప‌లేం. సాయంత్రంలోగా మ్యాజిక్ ఫిగ‌ర్ దాటొచ్చు అని ఆయన అన్నారు. క్రికెటర్ మనోజ్ తివారీ (టీఎంసీ) ఆధిక్యంలో ఉండగా బీజేపీ నుంచి లాకెట్ ఛటర్జీ వెనుకంజలో ఉన్నారు.

కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి బబుల్ సుప్రియో టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై టీఎంసీ అభ్యర్థి, రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి అరూప్ బిశ్వాస్ 9,800 ఓట్ల పైచిలుకు ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ చుంచుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె టీఎంసీ అభ్యర్థి అసిత్ మజుందార్ కన్నా వెనుకంజలో ఉన్నట్లు తెలుస్తోంది.

తారకేశ్వర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి స్వపన్ దాస్ గుప్తా తన సమీప ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్థి రామేందు సిన్హా రాయ్ కన్నా వెనుకబడినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు రాహుల్ సిన్హా హబ్రా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కూడా తన సమీప ప్రత్యర్థి, టీఎంసీ అభ్యర్థి కన్నా వెనుకబడినట్లు సమాచారం.