TS Paddy Procurement: కేసీఆర్ సర్కార్ ఓ విఫల ప్రభుత్వం, బియ్యం పంపిణీలో పూర్తిగా విఫలమైంది, కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధ్వజం, ఇకపై నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరణ
బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది కేంద్రం ఆరోపణలు గుప్పించింది. ధాన్యం కొనుగోళ్లపై (TS Paddy Procurement) తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆకయన (Union Minister Piyush Goyal) విమర్శించారు.
Hyd, July 20: బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది కేంద్రం ఆరోపణలు గుప్పించింది. ధాన్యం కొనుగోళ్లపై (TS Paddy Procurement) తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు. రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని ఆకయన (Union Minister Piyush Goyal) విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.
తెలంగాణలో ధాన్యం, బియ్యం కొనుగోలుకు సంబంధించిన విషయంపై సహచర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బుధవారం మీడియా ముందుకు వచ్చిన గోయల్.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ సీఎం అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్తో పాటు తెలంగాణ మంత్రులు కూడా అసభ్య పదజాలాన్నే వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అన్పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా గోయల్ ఆరోపించారు.
నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా అన్యాయం చేసిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని గోయల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఓ విఫల ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులపైనా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు కేంద్రానికి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని పీయూష్ ధ్వజమెత్తారు. ఏప్రిల్ నుండి PMGKY కింద అదనంగా 5 కిలోల ఉచిత రేషన్ పంపిణీ చేయలేదని పియూష్ గోయల్ మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీరుతోనే పేదలకు బియ్యం అందడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని భావించి వెంటనే వడ్లు, బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ మిల్లుల్లో నిల్వ సౌకర్యాలు సరిగా లేవని పీయూష్ గోయల్ విమర్శించారు. ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్ స్టాక్ నిల్వలు సరిగా లేవని అన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగాయని అందుకే ఈ చర్చ తీసుకున్నామని తెలిపారు. తమ చర్చల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్, మే నెలలో బియ్యం ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేశారన్నారు.
బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ
ఈ నేపథ్యంలో తెలంగాణలో బియ్యం సేకరణ నిలిపివేతపై కేంద్రం వివరణ ఇచ్చింది. ప్రధానమంత్రి అన్న యోజన (PMGKY) కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని.. అందుకే సెంట్రల్ పూల్లోకి బియ్యం సేకరించడాన్ని నిలిపివేశామని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వమే సృష్టించిందని విమర్శించింది. అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం మండిపడింది. కేంద్ర బృందాల ప్రత్యక్ష తనిఖీల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని పేర్కొంది.
40 మిల్లుల్లో 4,53,896 బియ్యం సంచులు మాయమవడాన్ని గుర్తించామని తెలిపిన కేంద్రం.. డిఫాల్టయిన మిల్లర్ల జాబితాను మార్చి 31న తెలంగాణ ప్రభుత్వానికి పంపించామని వెల్లడించింది. అయితే మళ్లీ మే 21న 63 మిల్లుల్లో 1,37,872 బియ్యం సంచులు మాయమైన అంశం వెలుగులోకి వచ్చిందని, 593 మిల్లుల్లో లెక్కించడానికి వీలు లేకుండా ధాన్యం సంచులను నిల్వచేశారని పేర్కొంది. లోపాలను సరిదిద్దుకుంటామన్న తెలంగాణ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేకపోయిందని తెలిపింది.
అన్న యోజన కింద ఏప్రిల్-మే నెలల కోటా కింద 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. అయితే ఆ బియ్యాన్ని లబ్దిదారులకు అందకుండా చేసిందని, ఈ కారణంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో సెంట్రల్ పూల్లోకి బియ్యం సేకరణను నిలిపివేసినట్లు తెలిపింది.పై కారణాలతో సెంట్రల్ పూల్ సేకరణ నిలిపివేయాల్సి వచ్చిందని, వీటిపై యాక్షన్ టేకెన్ రిపోర్టును తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి అందజేయాలని ఆదేశించింది. ఆ తరువాత సెంట్రల్ పూల్ సేకరణ అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ స్పష్టం చేసింది.
నేరుగా రైతుల నుంచి ధాన్యం సేకరణ
ఇక తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ధాన్యం సేకరణకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో పండిన ధాన్యం సేకరణలో జాప్యం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్న కేంద్ర మంత్రులు... నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించేందుకు ఎఫ్సీఐకి ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ రైతుల నుంచి ధాన్యంతో పాటు బియ్యాన్ని కూడా సేకరించేందుకు త్వరలోనే ఎఫ్సీఐ రంగంలోకి దిగుతుందని వారు ప్రకటించారు. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ సర్కారు రాజకీయం చేస్తోందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు ఆరోపించారు.
(The above story first appeared on LatestLY on Jul 20, 2022 07:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

