
Newdelhi, Feb 23: వయసు పైబడి తీవ్రమైన వెన్ను నొప్పితో (Back Pain) బాధపడే వారు, ఆఫీసులో గంటలపాటు కుర్చీలో అలాగే కూర్చొనే వారు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు (Injections) చేయించుకోవడం తెలిసిందే. అయితే ఈ తరహా ఇంజెక్షన్లు వద్దని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్, ఇన్ ఫెక్షన్, ఇన్ ఫ్లమేటరీ ఆర్థరైటీస్ తో సంబంధం లేని దీర్ఘకాలిక వెన్నునొప్పితో బాధపడే వారికి ఎపిడ్యూరల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, నరాల బ్లాక్లను సిఫార్సు చేయరాదని వీరు సూచించారు. మెదడుకు నొప్పికి సంబంధించిన సంకేతాలు చేరకుండా నిరోధించే ఎపిడ్యూరల్ ఇంజక్షన్లు, నరాల బ్లాక్లు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ విధానాలు అనుసరిస్తున్నారని, ఇలాంటివి కూడదని వారు తెలిపారు. వైద్యులు, రోగులు ఈ చికిత్స విధానాలకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ విధానాలను పాటించాలని వారు సూచించారు. కెనడా, అమెరికా, ఆస్ట్రేలియాకు చెందిన రోగులపై వీరు చేసిన పరిశోధనకు సంబంధించిన వివరాలు బీఎంజేలో ప్రచురితమైంది.
ఏంతో ప్రమాదం..
తీవ్ర వెన్ను నొప్పి రోగం ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఇది శారీరక వైకల్యానికి కూడా దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా 20-59 ఏండ్ల మధ్య వయస్కుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరికి ఇది వస్తున్నట్టు తెలిపారు. ఇంకా ఎక్కువ వయస్కులను అచేతనంగా మార్చివేస్తున్నదన్నారు. వ్యాయామం, యోగా, మంచి ఆహరం, దినచర్యలతో వెన్ను నొప్పిని తగ్గించవచ్చని తెలిపారు.