Expensive Biryani: ఆ బిర్యానీ ఖరీదు రూ. 40 వేలు/- ! ఏముంది దాంట్లో అంత విశేషం, దాని రుచి అంతగొప్పగా ఉంటుందా అంటే ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది.
Image used for representational purpose only | (Photo Credits: Flickr, jojo nicdao)

Viral News- Chennai:  ప్రియా అగర్వాల్ అనే 21 ఏళ్ల మహిళ ఒక బిర్యానీకి ఏకంగా 40 వేల రూపాయలు చెల్లించింది. అలా అని ఆమె ఏమి ఖరీదైన హోటెల్ కు వెళ్లి తిన్నది లేదు. కేవలం ఒక ఫుడ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌‌లో బిర్యానీ ఆర్డర్ ఇచ్చింది. కానీ ఆ ఆర్డర్ ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ ను ఖాళీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే.. అసలుకి ఆ బిర్యానీ ధర రూ.76 మాత్రమే. అయితే ప్రియా ఒక ఫుడ్‌యాప్ ద్వారా ఆ బిర్యానీకి ఆన్‌లైన్‌లో ఆర్డర్ ఇచ్చి 76 చెల్లించింది. అయితే టెక్నికల్ సమస్య వల్ల ఆమె చేసిన ఆర్డర్ క్యాన్సెల్ అయినట్లు ఆమెకు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమెకు రావాల్సిన 76 రూపాయల కోసం కస్టమర్ కేర్‌ను సంప్రదించాలనుకుంది. ఆ ఫుడ్ యాప్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి అక్కడ కనిపించిన నెంబర్‌కు కాల్ చేసింది. అయితే ఆమె దురదృష్టం కొద్దీ అది రాంగ్ నెంబర్, అది కూడా ఫ్రాడ్ ఫోన్ నంబర్. దీంతో ఆమె తన 76 రూపాయల కోసం అతడికి కాల్ చేస్తే, అది చాలా చిన్న అమౌంట్ అని తిరిగి పంపించడం వీలు కాదు మరో 5000 వేలు పంపించాల్సిందిగా కోరాడు, అలా చేస్తే ఈ 5 వేలతో పాటు, 76 రూపాయలు కలిపి తిరిగి 5076/- పంపిస్తానని చెప్పాడు. అది నమ్మిన ఆ మహిళ అతడికి గూగుల్ పే ద్వారా 5 వేలు పంపించింది. అయితే ఆ ఫ్రాడ్ ఆ 5 వేలు జమ కాలేదు, మళ్లీ ఇంకోసారి ట్రై చేయాల్సిందిగా చెప్పాడు, పనిలో పనిగా ఆమె బ్యాంక్ వివరాలు తీసుకున్నాడు.

అసలు డబ్బు రావడం లేదని చెప్తూ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవుతుంది, OTP ఇవ్వండంటూ ఆమెను నమ్మబలికి ఆమె బ్యాంక్ ఖాతా ద్వారా అతడి ఖాతాలోకి డబ్బు ప్రతీసారి 5000 పంపించుకున్నాడు, ఇలా 8 సార్లు 5 వేలు చొప్పున 40,000 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు, త్వరలోనే డబ్బు రీఫండ్ అవుతుందని చెప్పాడు.

ఇది జరిగిన కొన్ని రోజులకి ఆమె అకౌంట్ చూసుకుంటే ఖాతాలోంచి 40 వేలు పోయాయి. అదే నెంబర్‌కి తిరిగి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. అప్పుడు ఆమెకు విషయం అర్థమై  మోసపోయిందని గ్రహించింది. విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తులో ఉంది.

ఈ సంఘటన ఇటీవలే జూలై మాసంలో చెన్నైలో జరిగింది. ఆన్‌లైన్‌లో ఇలాంటి మోసాలు చాలా జరుగుతాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో కనిపించే ప్రతీది నమ్మకూడదు.