KFC Serves Raw Chicken: పచ్చి చికెన్ తినాలనుకుంటున్నారా? అయితే కేఎఫ్సీకి వెళ్లండి! ఫింగర్ లికింగ్ గుడ్ అని లొట్టలేసుకుంటూ తినేవారికి షాకింగ్ వార్త
ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పిండి పదార్థం మాత్రమే బాగుండగా లోపల చికెన్ మాత్రం అప్పుడే చికెన్ సెంటర్ నుంచి స్నానం చేయించి తీసుకొచ్చిన తాజా కోడి ముక్కలాగా నిగనిగలాడింది. ఇదేందయ్యా ఇదీ...
Hyderabad, August 9: హాఫ్ బాయిల్డ్ గుడ్డు తినడానికి చాలా మంది ఇష్టపడతారు, అదే హాఫ్ బాయిల్డ్ చికెన్ తినమంటే ఎవరైనా తినగలరా? కానీ హైదరాబాద్ లోని ఓ కేఎఫ్సీలో హాఫ్ బాయిల్డ్ చికెన్ వడ్డిస్తున్నారని ఓ కస్టమర్ ట్విట్టర్ కెక్కాడు.
వివరాల్లోకి వెళ్తే, నగరంలోని కూకట్ పల్లి మెట్రో వద్ద కల కేఎఫ్సీలో చికెన్ తినడానికి సాయితేజ అనే ఓ వ్యక్తి వెళ్లాడు, అతడికి వచ్చిన చికెన్ ఆర్డర్ను తింటూ ఉండగా మొదట్లో బాగానే ఉన్నా, తింటూ పోతే పచ్చిపచ్చిగా ఉడికి ఉడకనట్లుగా అనిపించింది. పైన ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన పిండి పదార్థం మాత్రమే బాగుండగా లోపల చికెన్ మాత్రం అప్పుడే చికెన్ సెంటర్ నుంచి స్నానం చేయించి తీసుకొచ్చిన తాజా కోడి ముక్కలాగా నిగనిగలాడింది. ఇదేందయ్యా ఇదీ అని అవాక్కయిన ఆ వ్యక్తి వెంటనే రెస్టారెంట్ సిబ్బందికి విషయాన్ని తెలియజేశాడు. అయితే అక్కడి సిబ్బంది మాత్రం సాయి తేజ ఫిర్యాదును లైట్ తీసుకున్నారు.
దీంతో కేఎఫ్సీలో తనకు వడ్డించిన చికెన్ ముక్కను సాయితేజ ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా కూకట్పల్లి మున్సిపల్ జోనల్ కమీషనర్ను ట్యాగ్ చేసి తన అనుభవాన్ని వివరించాడు, ఇలాంటి ఆహారాన్ని తింటే స్టమక్ ప్రాబ్లెమ్స్ వస్తాయని తెలియజేశాడు. ఈ ఫిర్వాదును స్వీకరించిన జోనల్ కమీషనర్ వెంటనే కేఎఫ్సీ కూకట్పల్లి బ్రాంచిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అటు కేఎఫ్సీ కూడా జరిగిన తప్పిదాన్ని గుర్తించి తమ కస్టమర్కు క్షమాపణలు చెప్పింది.
Here's the tweet:
@KFC_India Very Disappointed with the Quality of Food which was Taken today from JNTU Metro #kfcStore in #Hyderabad. The Piece was Not at all cooked & if you serve such kind of Food, Customers will get Stomach Problems. Req @zckukatpally Garu to Send @AMOH_KUKATPALLY for Checking pic.twitter.com/EysElyYLTc
— SAITEZAA (@ActivistTeja) August 8, 2021
ఏదైమైనా బయట తినే ఆహారం పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలి. అందమైన రంగులు వేసి, బయట క్రిస్పీ లోపల జ్యూసీ, తినే చేతి వేళ్లను కూడా నాకేంత రుచిగా ఉంటుందనే ప్రకటనలు వేసి, ప్రజలను ఆకర్శించే రెస్టారెంట్లలో నాణ్యత లేని ఆహారాన్ని తిని ఈ కోవిడ్ సమయంలో అనవసరంగా రోగాలపాలు కావొద్దు. నాణ్యత లేని వడ్డించే హోటెళ్లు, రెస్టారెంట్లపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయండి. సాధ్యమైనంత వరకు ఇంట్లో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వండి.
(The above story first appeared on LatestLY on Aug 09, 2021 04:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

