
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా రావల్పిండిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా Vs ఆస్ట్రేలియా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. దీంతో ఇరుజట్లకు చెరొక పాయింట్ లభించనున్నది. గ్రూప్-బీలో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తొలి రెండుస్థానాల్లో ఉన్నాయి. రెండు జట్లు చెరొక మ్యాచ్లో గెలువగా.. ఆయా జట్ల ఖాతాలో తలో మూడు పాయింట్లు ఉన్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3.10 గంటలకు పరిశీలించగా.. వర్షం కురుస్తూనే ఉంది. అయితే, కనీసం 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించాలని భావించినా సాధ్యపడలేదు. దీంతో మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
సౌతాఫ్రికాకు ఇంగ్లాండ్తో ఒక మ్యాచ్ మిగిలి ఉండగా.. ఆఫ్ఘనిస్తాన్తో ఆస్ట్రేలియాతో తలపడనున్నది. గ్రూప్-బీలో ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ చెరో మ్యాచ్ ఆడగా.. అవి ఓడిపోయాయి. ఇంగ్లాండ్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో, సౌతాఫ్రికాతో మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్ జట్లపై గెలిస్తే నేరుగా సెమీస్కు చేరుకుంటాయి.
ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య రేపు (ఫిబ్రవరి 26) జరిగే మ్యాచ్ నాకౌట్ మ్యాచ్ ఉండగా.. ఇందులో ఓడిన జట్టు రేసు నుంచి నిష్క్రమిస్తుంది. సెమీస్కు చేరాలంటే మాత్రం ప్రతి మ్యాచ్లోనూ విజయం సాధించాల్సిందే. శుక్రవారం ఆస్ట్రేలియా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య, శనివారం దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ మధ్య మ్యాచులు జరుగనున్నాయి. ఇక ఇంగ్లాండ్-ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్కు అర్హత సాధించాలంటే రెండు మ్యాచుల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సిందే.