T20 World Cup 2021: వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసిన ఇంగ్లండ్, 8 వికెట్ల తేడాతో బంగ్లా చిత్తు, సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జేసన్ రాయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు
England Cricket (Photo Credits: Twitter/ICC)

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో (T20 World Cup 2021) ఇయాన్ మోర్గాన్ సారథ్యంలోని ఇంగ్లాండ్ జట్టు బంపర్ విక్టరీ నమోదు చేసింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాను (England Register Consecutive Wins) మట్టికరిపించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌(38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ధ శతకంతో చెలరేగడంతో ఇంగ్లీష్‌ జట్టు కేవలం 14.1 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఆరంభంలోనే జోస్‌ బట్లర్‌(18 బంతుల్లో 18; ఫోర్‌, సిక్స్‌) ఔటైనప్పటికీ.. డేవిడ్‌ మలాన్‌(25 బంతుల్లో 28 నాటౌట్‌; 3 ఫోర్లు) సహకారంతో రాయ్‌ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖరో బెయిర్‌స్టో(4 బంతుల్లో 8 నాటౌట్‌; ఫోర్‌) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరిఫుల్‌ ఇస్లాం, నసుమ్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

బంగ్లా ఇన్నింగ్స్‌లో ముష్ఫికర్ (29) టాప్‌స్కోరర్‌గా నిలిస్తే, కెప్టెన్ మహ్మదుల్లా(19), నసం అహ్మద్(19) పరుగులతో పర్వాలేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మిల్స్(03) వికెట్లు.. మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడిన జేసన్ రాయ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్‌ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయంతో గ్రూప్-1లో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది.