T20 World Cup 2021: భారత్ సెమీస్‌కు చేరాలంటే దారి ఇదే, అక్టోబర్ 31 న్యూజిలాండ్‌‌తో చావో రేవో తేల్చుకోనున్న కోహ్లీ సేన, గెలిచిన జట్టుకు సెమీ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే..
Team India. Photo Credits: (@BCCI/Twitter)

టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup 2021) భారత్ పరాజయంతో తన ఇన్నింగ్స్ ప్రారంభించింది. దాయాది దేశం పాకిస్టాన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది. మరోవైపు బాబర్ ఆజమ్ బృందం ఆడిన రెండు మ్యాచ్ ల్లో ప్రత్యర్థులను చిత్తు చేసి సెమీస్ అవకాశాలను మరింతగా మెరుగుపరుచుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ (Pakistan) మిగతా మూడు మ్యాచ్ లు పసికూనలైన అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్‌ దేశాలతో ఆడాలి. కాబట్టి గ్రూప్ 1 నుంచి పాకిస్తాన్ సెమీస్ బెర్తు దాదాపు ఖాయమైనట్లే. ఇప్పుడు మిగతా జట్లలో ఏ జట్టు గ్రూప్ 1 నుంచి సెమీస్ కు వెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ కు చేరాలంటే చాలానే కష్టపడాలి. భారత్ అవకాశాలను పరిశీలిస్తే..గ్రూప్‌-2లో మంగళవారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్‌...న్యూజిలాండ్‌ను ( New Zealand) ఓడించింది.  ఇక  గ్రూప్‌లో ఉన్న మూడో పెద్ద జట్టు భారత్‌. ఈ మూడు పెద్ద జట్లూ ఎటువంటి సంచలనాలు లేకుండా చిన్న జట్లయిన అఫ్ఘానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌లను ఓడిస్తాయనుకుంటే...భారత్‌ సెమీస్‌కు వెళ్లే అవకాశాలు కింది విధంగా ఉంటాయి.

మొదటిదారిని పరిశీలిస్తే.. ఈనెల 31న జరిగే మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై (India vs New Zealand) తప్పక గెలవాలి. అప్పుడు భారత్‌ 8, పాక్‌ 10 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. కివీస్‌ 6 పాయింట్లతో ఇంటికి వెళ్తుంది. ఒకవేళ భారత జట్టు కివీస్‌ చేతిలో ఓడితే.. పాక్‌ 10, కివీస్‌ 8 పాయింట్లతో సెమీస్ కు చేరుతాయి. భారత్‌ 6 పాయింట్లతో నిష్క్రమిస్తుంది. అయితే ఇలా జరగాలంటే భారత్, న్యూజీలాండ్, పాకిస్తాన్ మిగతా మూడు జట్లను ఓడించాలి. అలా జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. అంటే భారత్ పసికూనలైన మూడు జట్లను చిత్తు చేయాలి. అలాగే న్యూజీలాండ్ తో తప్పక గెలవాలి. అప్పుడు భారత్ సెమీస్ కు చేరుతుంది.

టీ20 ప్రపంచకప్‌ను ఓటమితో ఆరంభించిన కోహ్లీ‌సేన, వికెట్ పడకుండానే ఇండియాపై ప్రతీకారం తీర్చుకున్న పాక్, ప్రపంచకప్‌ చరిత్రలో దాయాది దేశానికి భారత్‌పై 10 వికెట్ల తేడాతో తొలి విజయం

గ్రూప్ 1లో ఉన్న అఫ్ఘానిస్థాన్‌, నమీబియా, స్కాట్లాండ్‌ జట్లు మూడు పెద్ద జట్లను ఓడిస్తే అవి కూడా సెమీస్ రేసులో ఉంటాయి. మరి అవి గెలిచి సంచలనం సృష్టిస్తాయా లేదా అన్నది ముందు ముందు మ్యాచ్ లు చూడాలి.