IND vs ENG 2nd Test 2021 Day1 Highlights: రెండో టెస్ట్ మొదటిరోజు అదరగొట్టిన ఓపెనర్స్, కేఎల్ రాహుల్ సెంచరీ నాటౌట్, భారీస్కోర్ దిశగా పయనిస్తున్న భారత్, తొలిరోజు ఆట ముగిసే సమయానికి 276/3 స్కోర్ చేసిన టీమిండియా
KL Rahul celebrating his hundred (Photo credit: Twitter)

London: ఇంగ్లండ్ మరియు ఇండియా మధ్య లండన్ లోని ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్టును టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌ (127 బ్యాటింగ్‌; 248 బంతుల్లో 12×4, 1×6), రోహిత్‌ శర్మ (83; 145 బంతుల్లో 11×4, 1×6) గొప్పగా బ్యాటింగ్‌ చేయడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

తొలి రోజు ఆట ముగుస్తుందనగా ఆఖర్లో కెప్టెన్‌ విరాట్ కోహ్లి (42; 103 బంతుల్లో 3×4) దురదృష్టవశాత్తు ఔటవ్వడం కాస్త నిరాశపరిచినా, రాహుల్‌తో పాటు రహానె (1) క్రీజులో ఉన్నాడు. ఆట తొలిరోజు 276/3 వికెట్లతో నిలిచిన భారత్ భారీస్కోరు దిశగా సాగుతోంది. రెండు రోజూ మెరుగైన బ్యాటింగ్‌ను కొనసాగిస్తే మ్యాచ్‌లో భారత్‌కు ఇక తిరుగుండదు.

Here's the update:

వర్షం కారణంగా తొలి టెస్టులో విజయావకాశాన్ని కోల్పోయి మ్యాచ్ డ్రా చేసుకున్న భారత్, రెండో టెస్టులో మాత్రం ప్రత్యర్థికి మరింత దీటుగా బదులిస్తోంది. టాస్ గెలిచి భారత్ కు బ్యాటింగ్ అప్పజెప్పిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఇప్పుడు తప్పుచేశానా? అనే భావనలో ఉండి ఉంటాడు. తొలి రోజు ఆట ఆరంభం నుంచే టీమిండియా ఓపెనింగ్ జోడి 126 పరుగుల రోహిత్‌ శర్మ -కేఎల్‌ రాహుల్‌లు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి సరికొత్త రికార్డును లిఖించారు. వీరిది 69 ఏళ్ల తర్వాత లార్డ్స్‌ మైదానంలో టెస్టు మ్యాచ్‌లో వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పిన టీమిండియా ఓపెనింగ్‌ జోడిగా నిలిచింది.

1952లో లార్డ్స్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వారి సరసన రోహిత్‌-రాహుల్‌ల జోడి చేరింది.