Indian Squad for World Cup: ఆ ఇద్దరూ టీమిండియా జట్టు నుంచి ఔట్, వన్డే ప్రపంచ కప్‌కు భారత జట్టు ఇదిగో, పేస్ దళాన్ని నడిపించనున్న జస్ప్రీత్‌ బుమ్రా
India Cricket Team during National Anthem (Photo Credit: Twitter/@ImTanujSingh)

అక్టోబర్‌ 5 నుంచి భారత్ వేదికగా జరగనున్న ప్రతిష్ఠాత్మక ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ (World Cup 2023) కోసం బీసీసీఐ (BCCI) భారత జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్‌-2023కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

మంగళవారం క్యాండీ వేదికగా జరిగిన విలేకరుల సమావేశంలో బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ చైర్మెన్‌ అజిత్ అగార్కర్ వెల్లడించాడు.అందరూ ఊహించినట్లగానే తిలక్‌ వర్మ, ప్రసిధ్ కృష్ణ, సంజూ శాంసన్‌కు వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కలేదు. ఆక్టోబర్‌ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న మ్యాచ్‌తో భారత్‌ తమ వరల్డ్‌కప్‌ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూడాలంటే టికెట్ ఖరీదు రూ.57 లక్షలు, ప‌ట్ట‌ప‌గ‌లే దోపిడీకి పాల్ప‌డుతున్నార‌ంటూ బీసీసీఐపై మండిపడుతున్న క్రికెట్ అభిమానులు

ఆసియా కప్‌తో పునరాగమనం చేసిన శ్రేయస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్‌లకు అవకాశం దక్కింది. సీనియర్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా పేస్ దళాన్ని ముందుండి నడిపించనున్నాడు. వన్డేల్లో పెద్దగా రాణించలేకపోతున్నా సూర్యకుమార్‌ యాదవ్‌ వైపు సెలక్టర్లు మొగ్గుచూపారు. శార్దూల్ ఠాకూర్, హార్దిక్‌ పాండ్యను పేస్‌ ఆల్‌రౌండర్లుగా.. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌కు స్పిన్‌ ఆల్‌రౌండర్లుగా అవకాశం కల్పించారు. యుజ్వేంద్ర చాహల్‌కు మరోసారి నిరాశే మిగలగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ను స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా తీసుకున్నారు.

ప్రపంచకప్‌కు భారత జట్టు: రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా(వైస్‌ కెప్టెన్‌), రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, శార్థూల్‌ ఠాకూర్‌.