
టీ20 ప్రపంచకప్-2021లో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్కు (Semis Against Australia) ముందు పాకిస్తాన్కు బిగ్ షాక్ తగలనుంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఫ్లూ కారణంగా షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ (Pakistan Players Mohammad Rizwan, Shoaib Malik) ఇద్దరూ నిన్న జరిగిన ప్రాక్టీస్ కు దూరమయ్యారు. వారికి నిర్వహించిన కోవిడ్ టెస్టులో నెగెటివ్ అని తేలింది. అయినప్పటికీ ఇద్దరికీ విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. కాసేపట్లో వారికి మరోసారి వైద్య పరీక్షలను నిర్వహిస్తారు. వైద్యులు ఇచ్చే రిపోర్టు ఆధారంగా వారు ఆడతారా? లేదా? అనే విషయం తేలుతుంది.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో (T20 World Cup) పాకిస్థాన్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లు ఆడిన పాక్ అన్ని మ్యాచ్ లలో గెలుపొంది సెమీస్ కు చేరింది. ఈరోజు ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ సెమీ ఫైనల్స్ లో తలపడుతుంది. అనారోగ్యం నేపథ్యంలో ఈ మ్యాచ్ కు మాలిక్, రిజ్వాన్ దూరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఇదే జరిగితే పాకిస్థాన్ కు పెద్ద సమస్యే అని చెప్పుకోవాలి.
ఓపెనర్ గా రిజ్వాన్ ఐదు మ్యాచ్ లలో 214 పరుగులు చేశాడు. షోయబ్ మాలిక్ మిడిలార్డర్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేసి సత్తా చాటాడు. ఒకవేళ ఈ మ్యాచ్కు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో లేకపోతే వారి స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీకు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరిని మ్యాచ్కు సిద్ధంగా ఉండమని పీసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా ఈ టోర్నమెంట్లో పాకిస్తాన్ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు.