APL 2022: ఆరు జట్లతో విశాఖలో ఏపీఎల్‌, జూలై 6 నుంచి 17వ తేదీ వరకు మ్యాచ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌కు ముఖ్య అతిధిగా సీఎం జగన్
Andhra Premier League (Photo-Twitter)

Viasakha, June 22: ఐపీఎల్‌ తరహాలో ఏపీ రాష్ట్రంలో ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) క్రికెట్‌ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖపట్నంలో జరుగుతాయి. ఈ పోటీలకు ఆరు ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఏపీఎల్‌కు శ్రీరాం గ్రూప్‌ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగస్వామ్యం అవుతున్న ఆరు ఫ్రాంచైజీ జట్ల అధినేతలు లోగోలను ఆవిష్కరించారు. క్రికెటర్ల వేలం ఈనెల 24న వైఎస్సార్‌ స్టేడియంలో జరుగుతుందని ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు. ఏసీఏ కోశాధికారి ఎస్‌ఆర్‌ గోపీనాధరెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సత్యప్రసాద్, సభ్యుడు ఆర్వీసీహెచ్‌ ప్రసాద్, ఆరు ఫ్రాంచైజీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఏపీఎల్‌లో ఆరు జట్లు ఇవే!

1. ఉత్తరాంధ్ర లయన్స్‌

2. రాయలసీమ కింగ్స్‌

3. గోదావరి టైటాన్స్‌

4.కోస్టల్‌ రైడర్స్‌

5. బెజవాడ టైగర్స్‌

6.వైజాగ్‌ వారియర్స్‌