Tokyo Olympics 2020: భారత్ ఖాతాలో మరో పతకం, కాంస్యం సాధించిన పురుషుల హాకీ జట్టు; మరో మ్యాచ్‌లో మహిళా రెజ్లర్ దూకుడు.. క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన వినేష్ ఫోగట్
Hockey-India, Tokyo Olympics 2020 | File Photo

Tokyo, August 5:  టోక్యోలో భారత కీర్తి పతాకం మరోసారి రెపరెపలాడింది. భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో బలమైన ప్రత్యర్థి జర్మనీని 5-4 తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో 41 ఏళ్ల తర్వాత ఒలంపిక్స్ లో భారత హాకీ జట్టు మరో పతకాన్ని ముద్దాడింది.

ఓయి హాకీ స్టేడియంలో కాంస్య పతకం కోసం భారత్, జర్మనీ జట్ల మధ్య జరిగిన పోరులో ఇరు జట్లు పోటాపోటీగా గోల్స్ సాధించాయి. హాఫ్ టైమ్ ముగిసే సమయానికి 3-3తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. అనంతరం తిరిగి ప్రారంభమైన ఆటలో భారత్ మరో 2 గోల్స్ చేసింది, చివరి రౌండ్ లో జర్మనీ కూడా మరో గోల్ చేసి తన స్కోరును 4కు పెంచుకుంది. అయితే ఆ తర్వాత భారత హాకీ జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో విజయం భారత్ సొంతమైంది, పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల పతక నిరీక్షణను ముగించింది. సిమ్రంజీత్ సింగ్ భారత్ కోసం రెండు గోల్స్ చేశాడు, హార్దిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్ మరియు రూపిందర్ పాల్ సింగ్ కూడా స్కోర్‌షీట్‌లో తమ పేర్లను జోడించారు.

Here's the update:

టోక్యో ఒలంపిక్స్ క్రీడలు పదమూడో రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. గురువారం మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో జరిగిన  మొదటి మ్యాచ్ లో  భారత రెజ్లర్ వినేష్ ఫోగట్  శుభారంభం చేసింది. ప్రీక్వార్టర్ ఫైనల్స్ లో దూకుడుగా ఆడిన ఆమె క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించింది. తొలి మ్యాచ్ లో వినేష్ ఫోగట్ గత రియో ఒలంపిక్స్ లో కాంస్య పతాక విజేత అయిన స్వీడన్ కు చెందిన మ్యాటిసన్ సోఫియాతో తలపడింది.  ఆట ప్రారంభమైనప్పటి నుంచీ ప్రతీ దశలో ప్రత్యర్థిపై ఆదిపత్యం చెలాయించిన వినేష్ , చివరకు మొదటి మ్యాచ్‌లో 7-1 తేడాతో విజయం సాధించింది.

తాజా*.. అయితే  క్వార్టర్‌ ఫైనల్‌ లో వినేష్ ఫొగాట్‌ ఓటమిపాలైంది. 53 కిలోల విభాగంలో బెలారస్‌ రెజ్లర్‌ వనెసా చేతిలో 9-3 తేడాతో ఆమె ఓడిపోయింది.