AP CM YS Jagan: కరోనాపై ప్రజలను ఆందోళనకు గురి చేయకండి, ముందస్తు జాగ్రత్తలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం, కాల్ సెంటర్ ఏర్పాటుచేయాలని ఆదేశాలు
Andhra Pradesh CM YS Jagan Mohan Reddy | File Photo

Amaravati, Mar 07: ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్‌(COVID-19) నిరోధంకు తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy) శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి, సీఎం కార్యాలయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పీవీ రమేష్‌లతోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.కరోనా (Coronavirus) వ్యాపించకుండా తీసుకుంటున్న ముందస్తు చర్యలను ఈ సందర్భంగా అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు.

దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ.. ప్రజలను ఆందోళనకు గురిచేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించడంతోపాటు.. కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనుమానిత కేసులుంటే వారికి వెంటనే వైద్య సదుపాయం అందేలా చూడాలని చెప్పారు. గ్రామ సచివాలయాలను కరోనా వైరస్‌ నిరోధంలో భాగస్వామ్యం చేయాలని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కరోనా వైరస్‌ సోకితే ఏం చేయాలి, ఏం చేయకూడదనే దానిపై గ్రామ, వార్డు సచివాలయాలకు సమాచారం పంపాలని సూచించారు. అనంతపురం, విజయవాడల్లో ప్రత్యేక వార్డుల నిర్వహణకు రూ. 60 కోట్లు , ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి రూ. 200 కోట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఏపీ నుంచి ఆ నలుగురు?, విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్

కాగా విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి వివరాలు సేకరిస్తున్నామని అధికారులు ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. వారిని సంప్రదించి ఆరోగ్య వివరాలు సేకరించడంతోపాటు.. జాగ్రత్తలు సూచిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదని తెలియజేశారు. 24 అనుమానిత కేసుల్లో 20 నెగెటివ్‌ వచ్చాయని.. మరో నాలుగింటికి సంబంధించి రిపోర్ట్స్‌ రావాల్సి ఉందని వివరించారు.

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్నాయని ఎవరైనా కాల్‌చేస్తే ప్రభుత్వ అంబులెన్స్‌లో నేరుగా ఆస్పత్రికి తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు. రోగిని తరలించిన వెంటనే ఆ అంబులెన్స్‌ను పూర్తిగా స్టెరిలైజ్‌ చేస్తాం. దీనికి సంబంధించిన ప్రోటోకాల్స్‌ రూపొందించుకున్నాం. ఎక్కడైనా పాజిటివ్‌ కేసు వస్తే ఆ ఇంట్లో ఉన్నవారికి, చుట్టుపక్కల వారిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంచుతాం. విదేశాలనుంచి వచ్చిన వారు ఎవరైనా 14 రోజులు సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్తున్నామ’ని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు