Cinema Ticket Prices Row: సినిమా టికెట్‌ ధరల జీవోని కొట్టివేసిన హైకోర్టు, తీర్పును సవాల్ చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం, ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపిన ప్రభుత్వ న్యాయవాది
AP High Court (Photo-Twitter)

Amaravati, Dec 15: ఇటీవల ఏపీలో సినిమా టికెట్ల ధరలు (Cinema Ticket Prices) తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సామాన్య ప్రజల ప్రయోజనం రీత్యా ఏపీలో సినిమా టికెట్ల ధరలను ప్రభుత్వం ఇటీవల భారీగా తగ్గించింది. ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకం విధానం తీసుకువచ్చింది. దీనికి సంబంధించి జీవో నెం.35 జారీ చేసింది. అయితే సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం ఇచ్చిన జీవోను నేడు హైకోర్టు కొట్టివేసింది. పాత పద్ధతిలోనే టికెట్ల అమ్మకానికి అంగీకారం తెలిపింది అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేయాలని ఏపీ ప్రభుత్వం (AP Govt) నిర్ణయించింది.

కాగా టికెట్‌ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర హోంశాఖ ఈ ఏడాది ఏప్రిల్‌ 8న జారీ చేసిన జీవో 35ను హైకోర్టు (Andhra Pradesh HC ) సస్పెండ్‌ చేసింది. జీవో 35కు ముందు అనుసరించిన విధానంలో టికెట్‌ ధరలను నిర్ణయించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలకు/ పిటిషనర్లకు వెసులుబాటు ఇచ్చింది. ధరల నిర్ణయం సమాచారాన్ని లైసెన్సింగ్‌ అథార్టీ అయిన సంయుక్త కలెక్టర్లకు తెలియజేయాలని స్పష్టం చేసింది. జీవో 35 గతంలో హైకోర్టు ఇచ్చిన రెండు తీర్పులకు (HighCourt Verdict) విరుద్ధంగా ఉందని ప్రాథమికంగా అభిప్రాయపడింది.

ఏపీలో మూడు కొత్త మెడికల్ కాలేజీలు, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే 13 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు, రాజ్యసభలో ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి పవార్‌ వెల్లడి

మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలుగా ప్రాంతాలవారీగా వర్గీకరించి సినిమా టికెట్‌ ధరలను నిర్ణయించడానికి వీల్లేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా జీవో 35 ఉందని పేర్కొంది. మరోవైపు ధరలపై అధ్యయనానికి ఏర్పాటుచేసిన కమిటీకి హోంశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వం వహించాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని గుర్తుచేసింది. అందుకు భిన్నంగా ఆయనను సభ్యునిగానే పేర్కొన్నారని ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో జీవో అమలును సస్పెండ్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ప్రధాన వ్యాజ్యంపై లోతైనవిచారిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌ మంగళవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.

మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలుగా వర్గీకరించి సినిమా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 8న హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్‌ విశ్వజీత్‌ జీవో 35ను జారీచేశారు. దాన్ని సవాలు చేస్తూ తెనాలికి చెందిన లక్ష్మి శ్రీలక్ష్మి సినిమా థియేటర్‌ మేనేజరు వాసుదేవరావుతో పాటు పలు థియేటర్ల యాజమాన్యాల తరఫున న్యాయవాది వీవీ సతీష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. మరికొన్ని వ్యాజ్యాలు అత్యవసరంగా దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

కర్నూలులో వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పాటు చేస్తే మీకొచ్చే నష్టమేంటి, పిటిషనర్ ని ప్రశ్నించినఏఫీ హైకోర్టు, జీవో 16 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరణ

దీనిపై పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ...'గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వ జీవో ఉంది. కమిటీలో సినీ పరిశ్రమతో ముడిపడిన వారిని భాగస్వాములను చేయలేదు.. ప్రభుత్వ అధికారులే ఉన్నారు. కమిటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వం వహించలేదు. మరోవైపు ప్రాంతాలవారీగా టికెట్‌ ధరలను నిర్ణయిస్తూ గతంలో ఇచ్చిన జీవోను హైకోర్టు రద్దుచేసింది. గత జీవో తరహాలోనే జీవో 35ను జారీచేశారు.

గ్రామ పంచాయతీ పరిధిలోని నాన్‌ ఏసీ (ఎకానమీ) టికెట్‌ ధర రూ.5గా నిర్ణయించారు. డీలక్స్‌ రూ.10గా నిర్ణయించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో నాన్‌ ఏసీ ఎకానమీ ధర రూ.20గా పేర్కొన్నారు. ఏసీ/ఎయిర్‌ కూల్‌ (ప్రీమియం) ధర రూ.100గా నిర్ణయించారు. రూ.వందల కోట్లతో తీస్తున్న సినిమాలకు నామమాత్రంగా టికెట్‌ ధర రూ. 10, రూ.100గా నిర్ణయిస్తే థియేటర్లు మనుగడ సాగించలేవు. థియేటర్ల నిర్వహణ ఖర్చు భారీగా పెరిగింది. టికెట్‌ ధరలు పరిస్థితులకు తగ్గట్టు మార్చుకునేలా ఉండాలి. సినీ పరిశ్రమపై ఆధారపడిన వారి సంక్షేమానికి విఘాతం కలిగించేలా ప్రభుత్వ జీవో ఉంది. ఆ జీవో మా వర్తకంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే. దాని అమలును నిలుపుదల చేయండి' అని కోరారు.

ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. 'టికెట్‌ ధరలను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉంది. అధిక ధరలకు విక్రయించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన కమిటీ.. ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు, ఇతర భాగస్వాముల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంది. అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకున్నాకే జీవో జారీచేశాం. సినిమా బడ్జెట్‌ ఆధారంగా ధరలను పెంచుకుంటామని యాజమాన్యాలు చెప్పడం సరికాదు.

ధరల నిర్ణయ వ్యవహారం ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేకాధికారం. ఈ విషయంలో న్యాయస్థానాల జోక్యం పరిమితమైంది. ప్రజాహితం, ప్రైవేటు ప్రయోజనాలను సమన్వయం చేసుకుంటూ ధరలు నిర్ణయించాం. ఈ వ్యవహారంలో ప్రజాహితం ముడిపడి ఉంది. ఇదే జీవోను సవాలు చేస్తూ దాఖలైన మరో వ్యాజ్యంలో హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రస్తుత పిటిషన్ల విషయంలోనూ ఇవ్వొద్దని కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులకు విరుద్ధంగా జీవో ఉందనే ప్రాథమిక అభిప్రాయానికి వచ్చారు. జీవోను సస్పెండ్‌ చేశారు.