
Sattenapalli, May 11: సత్తెనపల్లిలో జనసేనకు భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ కీలక నేత యర్రం వెంకటేశ్వరరెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పుకున్నారు. బుధవారం కుమారుడు నితిన్ రెడ్డితో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. సత్తెనపల్లి బీజేపీ కన్వీనర్ పక్కాల సూరిబాబు కూడా వైఎస్సార్సీపీలో చేరారు.
వారందరికీ సీఎం జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఏపీఎండీసీ డైరెక్టర్ గాదె సుజాత తదితరులు పాల్గొన్నారు. సత్తెనపల్లి నుంచి 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో యర్రం వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి అంబటి మీడియాతో మాట్లాడుతూ.. మొదటి నుంచీ యర్రం వెంకటేశ్వరరెడ్డి.. వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితులన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన ఆయన్ను వాడుకుని వదిలేసిందని చెప్పారు. తనను ఓడించాలని కుట్ర పన్ని, కోడెల శివప్రసాద్, చంద్రబాబులతో కుమ్మక్కై అప్పటికప్పుడు నాదెండ్ల మనోహర్ ఆయనకు జనసేన బీఫాం ఇచ్చారన్నారు.
ఆ తర్వాత వెంకటేశ్వరరెడ్డిని జనసేన కార్యక్రమాలకు పిలవకపోగా, అభాసుపాలు చేశారని తెలిపారు. ‘మనోహర్, పవన్, చంద్రబాబులు విడిపోయినట్లు నటించి, మళ్లీ కలిశారు. ఇప్పుడు మళ్లీ బేరాసారాలు చేస్తున్నారు. ఇదంతా చంద్రబాబు కోసమేనని ప్రజలు గమనించాలి. వెంకటేశ్వరరెడ్డి, సూరిబాబుల చేరికతో పల్నాడులో వైఎస్సార్సీపీకి మరింత బలాన్నిస్తుందన్నారు. వారికి సరైన గౌరవం, సముచిత స్థానం ఇస్తామని చెప్పారు.
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వీరి సేవలను అన్ని విధాలా వినియోగించుకుంటామన్నారు. యర్రం వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. బలోపేతం అవుదామన్న ఆలోచన జనసేన నేతలకు లేదని చెప్పారు. తనకు ఎక్కడి నుంచీ పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపునకు తన వంతుగా పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పేదల సంక్షేమాభివృద్ధి కోసం సీఎం పరితపిస్తుండటం చూసి, తాను వైఎస్సార్సీపీలో చేరానని పక్కాల సూరిబాబు తెలిపారు.