
Amaravati, August 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిరోజు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర, తమిళనాడుల తర్వాత ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతున్న ఏపీ తొందరలోనే తమిళనాడును అధిగమించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,621 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండో రోజు 10 వేలకు పైగా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 3,93,090 కు చేరింది. అయితే ఇందులో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 3,90,195 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్గా నిర్ధారణ అయింది.
గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1089 కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రకాశం జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి, జిల్లాలో గడిచిన ఒక్కరోజులో 1020 కొత్త కేసులు నమోదయ్యాయి.
నెల్లూరు, గుంటూరు మరియు చిత్తూరు జిల్లాల నుంచి కూడా సుమారు వెయ్యికి దగ్గరగా పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID19 Report:

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 92 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 3,633కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,528 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 2,95,248 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 94,209 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.
గడిచిన ఒక్కరోజులో 61,300 మంది శాంపుల్స్ పరీక్షించినట్లు తెలిపింది. ఈరోజు వరకు సుమారుగా 34,79,990 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.