COVID in AP: కొవిడ్ నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆంధ్ర ప్రదేశ్, తగ్గుముఖం పడుతున్న పాజిటివ్ కేసులు, గత 24 గంటల్లో కొత్తగా మరో 5145 మందికి పాజిటివ్, 6110 మంది డిశ్చార్జ్
Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, October 9:  ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్ తీవ్రత తగ్గుముఖం పడుతోంది. క్రమక్రమంగా కేసులు తగ్గుతుండటం ప్రజలకు కొంత రిలీఫ్ కలిగించే విషయం. ప్రతిరోజు నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కూడా డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్యే ఎక్కువ ఉంటోంది. ఈ క్రమంలో ఆక్టివ్ కేసులు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ పోతున్నాయి.

గత 24 గంటల్లో ఏపిలో నమోదైన కేసుల విషయానికి వస్తే 70,521 మంది శాంపుల్స్  పరీక్షించగా రాష్ట్రవ్యాప్తంగా మరో 5,145 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 7,44,864కు చేరింది.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 7,41,969 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

చాలా వరకు జిల్లాల్లో కూడా కరోనావైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినా, కొన్ని జిల్లాల్లో ఇంకా తీవ్రత కొనసాగుతోంది. ట్రెండ్‌కు భిన్నంగా తూగో జిల్లా కంటే పగో జిల్లా ఎక్కువ కేసులు నమోదు చేసింది. గడిచిన ఒక్కరోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 862 పాజిటివ్ కేసులు నమోదు కాగా, తూర్పు గోదావరి నుంచి 738 కేసులు నమోదయ్యాయి.  మరోవైపు చిత్తూరు జిల్లా నుంచి 757 పాజిటివ్ కేసులు మరియు ప్రకాశం జిల్లా నుంచి 486 కేసుల చొప్పున నిర్ధారణ అయ్యాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో మరో 31 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 6,159 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో  6,110 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 6,91,040 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 47,665 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.