COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు, గడిచిన 24 గంటల్లో 5,487 మందికి పాజిటివ్, 7 వేలకు పైగా డిశ్చార్జ్
COVID19 Outbreak in Andhra Pradesh | Photo: Pixaby/ Twitter

Amaravati, September 28:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ విజృంభన కొనసాగుతోంది. అయితే గతంలో కంటే ఇప్పుడు కేసులు చాలా వరకు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల కంటే కూడా ఈ మహమ్మారి నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య రాష్ట్రంలో ఎక్కువగా ఉండటం ఊరటనిచ్చే విషయం.

గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 5,487 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 6,81,161కు చేరింది.

అయితే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 6,78,266 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

అయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొవిడ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.  గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచే అత్యధికంగా 1010 కేసులు నమోదయ్యాయి. ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 903 పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో  మరో 37 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 5,745 కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో  7,210 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 6,12,300 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 63,116 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  62,121 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు రాష్ట్రంలో  56,66,323 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.