YSR Rythu Bharosa: నెల్లూరు జిల్లా వేదికగా వైయస్సార్ రైతు భరోసా, స్కీం అమలుకోసం రూ.5వేల 510 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం, అక్టోబర్ 15న నెల్లూరుకి ఏపీ సీఎం జగన్, ప్రధానికి అందిన ఆహ్వానం
Ap CM Jagan Mohan Reddy to launch Rythu Bharosa on October 15 (Photo-Twitter)

Nellore, October 14:  పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తానని చెప్పిన వైయస్సార్సీపి అధినేత, ఏపీ సీఎం జగన్ (Ap CM Jagan Mohan Reddy) ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా రైతుల కోసం వైయస్సార్ రైతు భరోసా (YSR Rythu Bharosa) పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. కాగా ఈ స్కీమ్ అమలు కోసం ప్రభుత్వం రూ. 5వేల 510 కోట్ల నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.

రైతు భరోసా పథకం కింద 50లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంద. ఈ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

వ్యవసాయ మిషన్‌పై సమావేశం

వైఎస్ఆర్ రైతు భరోసా కింద ప్రతి రైతుకు రూ.12వేల 500 చెల్లిస్తారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ యోజన ద్వారా రూ.6 వేలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.6,500 జమ చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రం అందించే సాయం రైతుల ఖాతాలకు జమ చేయనున్నారు.కాగా ఈ స్కీం 2020 ఖరీప్ సీజన్ కి ముందు ప్రారంభించాలని అనుకున్నారు. అయితే వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని అందువల్ల అనుకున్న దానికంటే ముందే దీన్ని అమల్లోకి తీసుకువస్తున్నామని వ్యవసాయ శాఖామంత్రి కె కన్నబాబు తెలిపారు. వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమానికి రావాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇప్పటికే ఆహ్వనం అందించారు.

ప్రధానిని ఆహ్వానించిన ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.

సాధికార సర్వే ఆధారంగా ఆర్టీజీఎస్ ద్వారా జిల్లాకు పంపిన రైతుల జాబితాను క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక పంపారు. తొలి దశలో గుర్తించిన లబ్ధిదారులకు సాయం అందిస్తారు. జాబితాలో పేర్లు లేని వారి నుంచి సేకరించిన దరఖాస్తులను రాష్ట్ర స్థాయిలో పరిశీలించాక... వారికి కూడా సాయం అందిస్తారు. కౌలు రైతులు, సాధికార సర్వేలో పేర్లు లేని వారు తాజాగా వ్యవసాయశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. అలాంటివి 70 వేలు ఉన్నట్లు అంచనా. మరోసారి పరిశీలించాక.. అర్హతలను బట్టి లబ్ధిదారుల జాబితాలో చేరుస్తారు. 2020 నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.