YS Jagan Dasara Gifts: సీఎం జగన్ దసరా కానుకలు, ఆర్టీసి కార్మికులకు పదవీ విరమణ వయస్సు పెంపు , గ్రామ వాలంటీర్లకు అక్టోబర్ 1న జీతాలు, ఎంపికైన సచివాలయ ఉద్యోగులకు 31న నియామక పత్రాలు, తీపి కబురు చెప్పిన ఏపీ ప్రభుత్వం
ap-govt-will-pay-salary-to-grama-volunteer-on-october-1st ( Photo-tiwtter0

Amaravathi,September 28:  పరిపాలనలో తనదైన మార్కుతో దూసుకుపోతున్న ఏపీ సీఏం వైయస్ జగన్ ఏపీఎస్ఆర్‌టీసీ కార్మికులకు, గ్రామ సచివాలయం ఉద్యోగులకు, అలాగే వాలంటీర్లు శుభవార్తను అందించారు. ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే కార్మికులకు దసరా కానుక కింద ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పెంచి..దానిని సెప్టెంబర్ నుంచే అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం( Ap GOvernment) వెల్లడించింది. ఈ నిర్ణయంతో ఈ నెలలో రిటైర్మెంట్ చేసే వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ (Apsrtc) విలీనమైన నేపథ్యంలో పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60 ఏళ్లకు పెంచాలని నిపుణుల కమిటీ సిఫార్సు చేసిన ఇదివరకే సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 04న ఏపీఎస్2ఆర్టీసీ విలీనంపై ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ప్రతి నెలా ఆర్టీసీలో 200 నుంచి 300 మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే విలీన ప్రక్రియ పూర్తవడానికి ఇంకా మూడు నెలల గడువు ఉండడంతో ఆర్టీసీ ఉద్యోగులు తమకు 60 ఏళ్ల పెంపు వర్తించదేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని విలీన కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఆయన వెంటనే స్పందించి సెప్టెంబర్ నెల నుంచే 60 ఏళ్ల పెంపు వర్తింప చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనుంది. కాగా సీఎం జగన్‌ అధ్యక్షతన ఇటీవలే సమావేశమైన మంత్రివర్గం ఆర్టీసీలో పదవీ విరమణ వయస్సులో కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించేందుకు అంగీకారం తెలిపుతూ ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్ళు నుంచి 60 ఏళ్లకు పెంచింది. దీంతో ఆర్టీసీలోని 53వేల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరుతుంది.

వాలంటీర్లకు అక్టోబర్ 1న జీతాలు

గ్రామ వాలంటీర్ల జీతాల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉద్యోగుల తరహాలోనే అక్టోబర్ 1న వాలంటీర్లకు జీతం జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15 నుంచి ఈనెల 30 వరకు మొత్తం జీతాన్ని ప్రభుత్వం వచ్చేనెల 1వ తేదీనే చెల్లించనుంది. కాగా 1,92,848 మంది వాలంటీర్లకు గాను 1,85,525 మంది విధుల్లో ఉన్నారు. 1,50,621 మందికి అక్టోబర్ 1న గౌరవ వేతనం 7,500 పంచాయతీ రాజ్ శాఖ జమ చేయనుంది. కొన్ని కారణాల వలన సకాలంలో ధ్రువపత్రాలు సమర్పించని వారికి అక్టోబర్ 1 నుంచి 5 వ తేదీ లోపు గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా ఎంపికైన వాలంటీర్లకు ఐడీ కార్డులు అందజేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా నిర్వహించారు. రెండున్నర లక్షలమంది వాలంటీర్లను ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో వాలంటీర్ల సేవలు మొదలయిన సంగతి అందరికీ విదితమే.

సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెప్టెంబర్ 30వ తేదీన నియామక పత్రాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైన వారికి సెప్టెంబర్ 30వ తేదీన నియామక పత్రాలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. తొలి నియామక పత్రాన్ని విజయవాడలో సీఎం జగన్‌ చేతుల మీదుగా అందజేస్తారు.ఈ కార్యక్రమంలో జిల్లాల్లో ఆయా జిల్లాల ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల మంత్రులు పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు.

అక్కడ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో 13 జిల్లాల్లో ఉద్యోగాలకు ఎంపికైనవారు సీఎం ప్రసంగాన్ని వీక్షించేలా ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.రాత పరీక్షల్లో ఉత్తీర్ణులై సెప్టెంబర్‌ 30 నాటికి సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ పూర్తికాకుంటే వారికి వెరిఫికేషన్‌ పూర్తయిన వెంటనే అక్కడికక్కడే నియామక పత్రాలు ఇస్తారు. సచివాలయ వ్యవస్థకు తూర్పు గోదావరి జిల్లాలో అక్టోబర్ 2వ తేదీన ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది.

అక్టోబర్ 2 నుంచి గ్రామ సెక్రటేరియట్లు ప్రారంభం

అక్టోబర్‌ 2న కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కరప గ్రామంలో సచివాలయ భవనంను సీఎం ప్రారంభిస్తారు. ఆ రోజు నుంచే సచివాలయ ఉద్యోగులు విధుల్లో చేరుతారు.