Kurnool November 25: తమ దగ్గరికి వచ్చిన ఓ వింత దొంగతనం కంప్లైంట్ చూసిన కర్నూలు జిల్లా పోలీసులు షాకయ్యారు. ఐదారేళ్ల పిల్లాడు చేసిన ఫిర్యాదుపై ఎలా స్పందించాలో తెలియక, నవ్వుకున్నారు. తాను హోంవర్క్ చేస్తుంటే తన పెన్సిల్ దొంగిలించాడని పోలీస్‌ స్టేషన్ మెట్లెక్కాడు ఓ బుడతడు. కర్నూలు జిల్లా కడుబూరులో జరిగింది ఈ ఘటన. హ‌న్మంత్ అనే విద్యార్థి పెన్సిల్‌ను మ‌రో అబ్బాయి దొంగిలించాడు. దీంతో హ‌న్మంత్ స్థానిక పోలీసు స్టేష‌న్‌కు వెళ్లి పెన్సిల్ దొంగ‌త‌నంపై పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. ప్రతి రోజు పెన్సిల్స్ దొంగ‌త‌నం చేస్తున్నాడు. పైస‌లు కూడా తీసుకుపోతున్నాడు. రోజు ఇదే ప‌ని అని హ‌న్మంత్ పోలీసుల‌కు చెప్పాడు. ఈ ఒక్‌సారి కేసు పెట్టండి అని కోరాడు.

అయితే… సార్ పెన్సిల్ తిరిగి ఇచ్చాను అని మ‌రో అబ్బాయి సంజాయిషీ ఇచ్చుకున్నప్పటికీ.. హ‌న్మంత్ మాత్రం విన‌లేదు. ఇదొక్కసారి కేసు పెట్టండి సార్ అని పోలీసుల‌ను అడిగాడు హ‌న్మంత్. దీంతో అతను ఇచ్చిన కంప్లైంట్‌ కు నవ్వుకున్నారు పోలీసులు. ఇద్దరు పిల్లలకు సర్ధిచెప్పి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.