
Amaravati, April 28: దేశంలో కరోనా కేసులు తీవ్రం కావడంతో అనేక రాష్ట్రాలు లాక్డౌన్ విధించగా, ఏపీ సర్కారు పైనా ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ, లాక్ డౌన్ విధిస్తే అధికంగా నష్టపోయేది ప్రజలేనని అన్నారు.
లాక్ డౌన్ తో ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువగా ప్రతికూల ఫలితాలు చవిచూస్తారని వివరించారు. ప్రభుత్వానికి రూ.1 నష్టం జరిగితే, ప్రజలకు రూ.4 నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. లాక్ డౌన్ గురించి ఆలోచించేటప్పుడు ఇది ఎంతో కీలక అంశమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆక్సిజన్ లభ్యత గురించి చెబుతూ, ప్రస్తుతం రాష్ట్రానికి 340 మెట్రిక్ టన్నుల వరకు ఆక్సిజన్ వస్తోందని, ఇప్పటి అవసరాల దృష్ట్యా అది సరిపోతుందని అన్నారు.
లాక్డౌన్తో (2021 COVID-19 Lockdown) రాష్ట్ర ప్రభుత్వానికీ, సామాన్యప్రజలకూ తీవ్ర ఆర్థికనష్టం తప్పదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గతేడాది లాక్ డౌన్ వల్ల (2020 COVID-19 Lockdown) ప్రభుత్వానికి దాదాపు రూ.20,000 కోట్లనష్టం వాటిల్లింది. అంటే .. సామాన్యులు దాదాపు రూ.80,000 కోట్లు (Andhra Pradesh Rs 20,000 Crore, People Lost 80,000 Crore) నష్టపోయినట్టేనని సీఎం వ్యాఖ్యానించారు. కొవిడ్ సెకండ్వేవ్ (Covid Second Wave) వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వచ్చే కొన్నినెలలపాటు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్లకు సీఎం సూచించారు.
కొవిడ్, ఉపాధిహామీ పనులకింద లేబర్బడ్జెట్, గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్కులు, ఏఎంసీయూ, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణాలు, వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్కులు, 90 రోజుల్లో ఇంటిస్థలం కేటాయింపు, స్పందన కార్యక్రమం సమస్యల పరిష్కారం వంటి అంశాలు సహా.... ఏప్రిల్ , మే నెలల్లో అమలు చేయనున్న పథకాలపై సీఎం సమీక్షించారు. కరోనా నియంత్రణలోభాగంగా ఏడుకోట్ల వ్యాక్సిన్ల ఉత్పత్తిజరుగుతోందని, అందులో కొవాగ్జిన్ కోటి డోసులు కాగా .. మిగతావి కొవిషీల్డ్ ఉన్నాయని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకు వచ్చారు.
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడ్డవారిలో ఇప్పటివరకూ 11.30 లక్షలమందికి రెండు డోసు, దాదాపు 45.48 లక్షలమందికి తొలి డోసు ఇచ్చామని వివరించారు. రాష్ట్రంలో 18-45 ఏళ్ల వారికి ఉచితంగా వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్పారు. కొవిడ్ నియంత్రణలోభాగంగా అందరూ భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్క్లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని.. ఇవి మాత్రమే నివారణ మార్గాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు.
104 కాల్ సెంటర్ పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు. 104 నంబరుకు ఫోన్చేసేవారికి తక్షణమే పరిష్కారం చూపాలనీ, ఆస్పత్రికి వెళ్లడమా? హోం క్వారంటైన్కు పంపడమా? హోం ఐసొలేషన్లో ఉంచడమా అనే అంశాలపై స్పష్టతను ఇవ్వాలని చెప్పారు. 104 కాల్ సెంటర్కు వైద్యులు అందుబాటులో ఉండాలనీ, దానిని వన్ సెంటర్ సొల్యూషన్గా మలచాలని కోరారు.
కరోనానియంత్రణ బాధ్యత జాయింట్ కలెక్టర్లకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. ప్రభుత్వ ఆధీనంలోని ఆస్పత్రుల్లో అందుతున్న చికిత్సను సమీక్షించాలని, కొవిడ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో 59 సెంటర్లు అందుబాటులో ఉన్నాయని, రోజూ 320-340 టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని అధికారులు తెలపగా, అవసరమైనవారందరికీ ఆక్సిజన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎక్కడా ఆర్థిక కార్యక్రమాలు ఆగరాదన్నారు. కొవిడ్పై వదంతులు సృష్టించేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలని, అరెస్టులు చేయాలని ఆదేశించారు.