CBN Meets Pawan Kalyan: టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై సుధీర్ఘ చర్చ, పవన్ కల్యాణ్ ఇంటికి స్వయంగా వెళ్లిన చంద్రబాబు
CBN Meets Pawan Kalyan (PIC @ Janasena X)

Hyderabad, DEC 17: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో (Chandrababu Pawan Meet) ఆదివారం ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం ముగిసింది. ఇరువురి మధ్య గంటన్నర సేపుకు పైగా చర్చలు జరిగాయి. వారిద్దరి మధ్య చర్చలు (Discussions Between CBN And Pawan) సంతృప్తికరంగా సాగాయని జనసేన అగ్రనేత నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) చెప్పారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చలు జరిగాయన్నారు.

 

దాదాపు పదేళ్ల తర్వాత పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు పవన్‌ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి. ఏపీ ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ఇప్పటికే పవన్ ప్రకటించారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన (TDP, Janasena) విడివిడిగా పోటీ చేశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది.

 

భేటీ ముగిసిన తర్వాత నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడుతూ సమావేశం వివరాలను వెల్లడించారు. ‘‘భవిష్యత్‌ కార్యాచరణ, ఎన్నికల వ్యూహంపై చంద్రబాబు, పవన్‌ దాదాపు రెండున్నర గంటలపాటు చర్చించారు. చక్కటి పరిపాలన అందించడానికి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ కోసం ఎలా కలిసి పనిచేయాలి? పార్టీ పరంగా, సంస్థాగతంగా తీసుకోవాల్సిన కొన్ని నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది.

 

ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు మంచి భవిష్యత్‌ ఉండే విధంగా ఈ చర్చలు సంతోషకరంగా జరిగాయి. భవిష్యత్‌లో కూడా అన్ని కార్యక్రమాల్లో ఇరుపార్టీల క్యాడర్‌, నాయకులు కలిసికట్టుగా విజయం సాధించే విధంగా పనిచేస్తారు. మంచి ప్రభుత్వం ఏర్పడే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.