Sankalp Siddhi Cheating: లక్ష కడితే మూడు లక్షలు రిటర్న్, విజయవాడలో రూ. 1500 కోట్లకు పైగా వసూలు చేసిన సంస్థ, వస్తువులు కొంటే డబ్బులు వస్తాయంటూ ప్రజలు ఎర, ఇద్దర్ని చేర్పిస్తే మీ డబ్బులు వాపస్ అంటూ ప్రచారం
ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1500 కోట్ల వరకు సంకల్ప సిద్ధి మార్ట్ లో టర్నోవర్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Vijayawada, NOV 24: విజయవాడలో ఘరానా మోసం (Fraudlent Cheating) వెలుగుచూసింది. వస్తువులు కొనుగోలు చేస్తే డబ్బులు రిటర్న్ (Money return) వస్తాయంటూ భారీ మొత్తంలో ఖాతాదారులను చేర్చుకుని జనాన్ని బురిడీ కొట్టించినట్లు సంకల్ప్ సిద్ధి సంస్థపై (Sankalp Siddhi E-Cart) ఆరోపణలు వచ్చాయి. తమతో పాటు మరో ఇద్దరిని ఖాతాదారులుగా చేర్పిస్తే కమీషన్ ఇస్తామంటూ ఆశ చూపి ఆన్ లైన్ ద్వారా వేలాది మందిని చేర్చుకుంది ఆ సంస్థ. ప్రారంభించిన కొద్ది నెలల్లోనే మూడు బ్రాంచీలు ఏర్పాటు చేసింది. దాదాపు రూ.1500 కోట్ల వరకు సంకల్ప సిద్ధి మార్ట్ లో టర్నోవర్ జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు రావాలని పోలీసులు కోరారు.
లక్ష రూపాయలు చెల్లిస్తే 300 రోజుల్లో 3లక్షల రూపాయలు చెల్లిస్తామని ప్రకటించింది. దీంతో సంస్థ ప్రచారాన్ని నమ్మిన ప్రజలు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ సొమ్మును సంస్థ నిర్వాహాకులు రియల్ ఎస్టేట్, మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ కార్యకలాపాలపై కూపీ లాగుతున్నారు పోలీసులు. మరోవైపు ఈ చైన్ లింక్ బిజినెస్తో వంద కోట్లకు పైగా డిపాజిట్లు సేకరించినట్లు తెలుస్తోంది. లక్ష కడితే మూడు లక్షలు, రోజుకి వెయ్యి రూపాయలు చెల్లిస్తే చాలు అంటూ జనం నుంచి కోట్లకు కోట్లు కలెక్ట్ చేసింది సంకల్ప సిద్ధి సంస్థ. స్కీమ్ గడువు దాటినా డబ్బు చెల్లించకపోవడంతో సంకల్ప సిద్ధి సంస్థ మోసం బయటపడింది.
డబ్బు చెల్లించడం లేదంటూ సూర్యారావుపేట పోలీసులను ఆశ్రయించారు బాధితులు. డిపాజిట్దారుల కంప్లైంట్తో సంకల్ప సిద్ధి సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. కంపెనీ ఎండీ వేణుగోపాల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ తర్వాత విజయవాడలో ఉన్న మూడు బ్రాంచ్లకు తాళాలు వేశారు. జనం నుంచి పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుల మాయ మాటలతో మోసపోయామంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. లక్షకు మూడు లక్షలు ఇస్తామని చెప్పడంతో ఆశపడి డబ్బులు కట్టామని చెబుతున్నారు.
సంకల్ప సిద్ధి సంస్థ మోసం బయటపడటంతో ఏమి చేయాలో తెలియని దిక్కు తోచని స్థితిలో ఉన్నామంటున్నారు. తమ డబ్బు తమకు ఇప్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు. స్కీమ్స్ పేరుతో ఇలాంటి స్కామ్స్ పదేపదే బయటపడుతున్నా ప్రజలు మాత్రం మోసపోతూనే ఉన్నారు. అధిక వడ్డీలకు ఆశపడి కష్టపడి సంపాదించుకున్న డబ్బును పోగొట్టుకున్నారు. ఇప్పుడైనా ఇలాంటి స్కీమ్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Nov 24, 2022 09:37 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

