Cyclone Alert In Andhra Pradesh: ఏపీకి తప్పిన తుఫాను ముప్పు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు,  ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే చాన్స్..
Cyclone (Photo credits: IMD)

ఏపీపై విరుచుకు పడుతుందనుకున్న తుఫాన్ బలహీన పడినట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా తుఫాన్ ముప్పు తప్పినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.ఐతే తఫాన్ ముప్పు తప్పినా భారీ వర్షాలు మాత్రం రాష్ట్రాన్ని ముంచెత్తనున్నాయి. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఇది క్రమంగా పశ్చిన వాయవ్య దిశగా పయనించి 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడి వాయుగుండంగా మారనుంది. అనంతరం తీవ్రవాయుగుండంగా మారి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు మధ్య తీరాన్ని తాకే అవకాశముంది. తుఫాన్ గా కాకుండా వాయుగుండం లేదా తీవ్ర వాయుగుండంగా మారే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. అలాగే ఈనెల 17 ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయి. అటు విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. వాయుగుడం తీరాన్ని సమీపించే అవకాశమున్న ఈనెల 18వ తేదీన నెల్లూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి.

విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఈనెల 19నవిజయనగరం,విశాఖపట్నం,ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశముంది. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఈనెల 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు తీరప్రాంతం వెంబడి గంటకు 60కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.., మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. .