MLA Ambati Rambabu: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం, నిమ్మగడ్డ కేసుపై న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని తెలిపిన ఎమ్మెల్యే అంబటి రాంబాబు
YSRCP MLA Ambati Rambabu (Photo-Facebook)

Amaravati, May 29: నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను (nimmagadda ramesh kumar) రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా తిరిగి నియమించాలంటూ హైకోర్టు (AP High Court) ఇచ్చిన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో దీనిపై సుప్రీంకోర్టుకు (Supreme Court) వెళ‌తామ‌ని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు (MLA Ambati Rambabu) అన్నారు. నెల రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయ‌గా ఈసీ నిమ్మగడ్డ రమేష్ పదవిని కోల్పోయారని, ఆయన స్థానంలో జస్టిస్ కనగరాజ్ నియమించినట్లు ఆయన వెల్లడించారు. జగన్ సర్కారుకు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు

దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు హైకోర్టుకు వెళ్ళారని, ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ జీవోల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువ‌రించిందన్నారు. అయితే ఒక్కో స‌మ‌యంలో న్యాయం జ‌ర‌గ‌క‌పోవ‌చ్చని, అలాంట‌ప్పుడు పై కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉందని ఎమ్మెల్యే అంబటి పేర్కొన్నారు. నిమ్మగడ్డ కేసుపై న్యాయ‌ నిపుణుల‌తో సంప్రదింపులు జ‌రుపుతున్నామ‌ని ఆయన వెల్లడించారు.

Here's YSRCP MLA Ambati Rambabu Tweet

ఎన్నికల్లో మద్యం, డబ్బు అరికట్టాలని ప్రభుత్వం చట్టం తీసుకువస్తే దానిపై చంద్రబాబు పంపిన లేఖపై నిమ్మగడ్డ రమేష్ సంతకం పెట్టారని అన్నారు. మద్యం, డబ్బు పంపిణీని వ్యతిరేకిస్తూ నిమ్మగడ్డ లేఖ రాయడం నిజమా కాదా అని ప్రశ్నించారు. ఇటువంటి లేఖల వల్ల ప్రజాస్వామ్యం మంట కలిసిపోతుంద‌ని ఆయన వ్యాఖ్యానించారు.

ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ను తీసివేస్తూ ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా, రాజ్యాంగ‌బ‌ద్ధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చామ‌న్నారు. కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే గౌరవిస్తామని, ఇచ్చిన తీర్పును ప‌రిశీలించి అభ్యంతరాలు ఉంటే పై కోర్టుకు అప్పీలు చేస్తామన్నారు. అంతేకానీ కోర్టు వ్య‌తిరేకంగా తీర్పు ఇస్తే రాజీనామా చేయాలా అని ప్ర‌శ్నించారు.

గతంలో చంద్ర‌బాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో చాలాసార్లు కోర్టు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా తీర్పులిచ్చింద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. ప్ర‌భుత్వ అధికారాలు ఏమిటో ప్రభుత్వానికి తెలుసన్నారు. ప్రభుత్వానికి పరిమిత అధికారాలు ఎలా ఉంటాయో మిగతా వ్యవస్థలకు పరిమితికి లోబడి అధికారాలు ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి లోబ‌డే అన్ని వ్యవస్థలు పని చేయాల‌ని అంబ‌టి పేర్కొన్నారు.