Amaravati, January 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొవిడ్ మహామ్మారి దాదాపు నియంత్రణలోకి వచ్చింది. రోజురోజుకి కేసులు భారీగా పడిపోవటంతో పాటు, రికవరీలు పెరుగుతున్నాయి. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్ ప్రక్రియ కూడా ఏకధాటిగా కొనసాగుతోంది. పదో రోజు ఏపీలో 1,55,453 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది.
రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,717 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 56 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,87,066కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,81,171గా ఉంది.
గడిచిన ఒక్కరోజులో కృష్ణా జిల్లా నుంచి 11 కేసులు మినహా, మిగతా అన్ని జిల్లాల నుంచి పదిలోపే కేసులు నమోదయ్యాయి, 3 జిల్లాల నుంచి ఒక్క కేసు రాలేదు. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.
AP's COVID Update:
గడిచిన ఒక్కరోజులో మరో 2 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 7149కు పెరిగింది.
మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 141 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,78,528 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 1,389 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.