Pawan Kalyan: బీజేపీ ఎఫెక్ట్.. భారీ డైలాగ్స్ పేల్చిన పవన్ కళ్యాణ్, 'చూస్తూ ఊరుకోమని' జగన్ ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్, రాష్ట్ర పరిణామాలపై కేంద్రంలోని బీజేపి నేతలతో చర్చించినట్లు వెల్లడించిన జనసేనాని
Janasena Chief Pawan Kalyan | File Photo

Kakinada, January 14:  వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (MLA Dwarampudi)  వివాదాస్పద వ్యాఖ్యలు, కాకినాడ ఘటన పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం  స్పందించారు. నిన్న దిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, ఇతర నాయకులను కలిసిన ఆయన, అక్కడి కార్యక్రమాలు ముగించుకొని ఈరోజు నేరుగా కాకినాడ వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్, తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు.

ప్రభుత్వాన్ని నడుపుతున్న వైసీపీ ప్రజాప్రతినిధులు అకారణంగా లేని గొడవను సృష్టించారు. సభ్య సమాజంలో ఏ ప్రజా ప్రతినిధి ఉపయోగించని భాషను వాడుతూ తమ ఆడపడుచులను, జనసేన నాయకులను తిట్టిన తిట్లు, తమ వారిపై చేసిన దాడి క్షమించరానివని పవన్ (Pawn Kalyan) అన్నారు. మీరే బూతులు తిట్టి, తిరిగి మీరే కేసులు పెడతారా ? అంటూ వైసీపీ ప్రభుత్వం (Jagan Govt) పై ధ్వజమెత్తారు.

వైసీపీ నాయకులు మదమెక్కి మాట్లాడుతున్నారు, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చేతులు కట్టుకొని కూర్చోమని జనసేనాని తీవ్రంగా హెచ్చరించారు.

"మాకు బలం ఉంది కాబట్టే భరిస్తున్నాం, శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలనుకుంటే మీరెవ్వరూ ఇక్కడ ఉండరు, తెగించి రోడ్లమీదకు వస్తాం. నా మాట, నా సంస్కారం నియంత్రణలో ఉన్నాయి. 151 ఎమ్మెల్యేలు ఏమైనా దిగొచ్చారా? రాష్ట్రాన్ని నడిపే వ్యక్తులకు, పోలీసు ఉన్నతాధికారులకు చెప్తున్నా, ఇంకొక్క సంఘటన మాపై జరిగితే ఊరుకోం"  అని పవన్ హెచ్చరించారు. దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలన వస్తే పాలెగాళ్లు, ఫ్యాక్షన్ రాజకీయాలు వస్తాయనే తాను గత ఎన్నికల్లో కూడా చెప్పినట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలను కేంద్రంలోని బీజేపీ నేతల వద్ద చర్చించామని, ఏపీపై దృష్టి సారించాలని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లడంపై (BJP - Janasena Alliance) ఈనెల 16న విజయవాడలో ఇరు పార్టీలు కలిసి సంయుక్త ప్రకటన చేయనున్నట్లు స్పష్టం చేశారు.