COVID-19 Outbreak. | (Photo Credits: IANS)

Amaravati, August 28:  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి రోజురోజుకి మరింత ఉధృతమవుతోంది. రాష్ట్రంలో వరుసగా మూడో రోజు 10 వేలకు పైబడి కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.   గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా మరో 10,526 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కోవిడ్-19 కేసుల సంఖ్య 4,03,616కు చేరింది.  దీంతో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో 4,03,242 పాజిటివ్ కేసులతో ప్రస్తుతం రెండో స్థానంలో తమిళనాడు రాష్ట్రాన్ని అధిగమించి ఏపీ రెండో స్థానంలోకి వచ్చింది.

అయితే ఏపీలో నమోదైన మొత్తం కేసుల్లో  ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారివి మినహాయించి, కేవలం ఏపీ పరిధిలో మాత్రమే నమోదైన కేసులను పరిశీలిస్తే ఇప్పటివరకు 4,00,721 మందికి వైద్య పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

గడిచిన ఒక్కరోజులో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13 జిల్లాల నుంచి వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఒక్క తూర్పు గోదావరి జిల్లా నుంచి అత్యధికంగా 1178 కేసులు నమోదయ్యాయి. అలాగే నెల్లూరు జిల్లాలో కూడా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి, జిల్లాలో గడిచిన ఒక్కరోజులో 1151 కొత్త కేసులు నమోదయ్యాయి.

పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా వెయ్యికి దగ్గరగా 986  పాజిటివ్ కేసులు నిర్ధారించబడ్డాయి.  జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

AP's COVID Update:

Status of positive cases of #COVID19 in Andhra Pradesh

గడిచిన ఒక్కరోజులో అత్యధికంగా మరో 81 కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా మరణాలతో ఏపీలో కొవిడ్ మృతుల సంఖ్య 3,714కు పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 8,463 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ఇలా ఇప్పటివరకు 3,03,711 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 96,191 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

గడిచిన ఒక్కరోజులో  61,331 మంది శాంపుల్స్   పరీక్షించినట్లు తెలిపింది.  ఈరోజు వరకు సుమారుగా  35,41,321 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు జరిపినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.