COVID-19 in Telangana: తెలంగాణలో 404కు చేరిన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య, మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసికందుకు సోకిన వైరస్, గత 5 రోజుల్లోనే రాష్ట్రంలో 277 కేసులు నమోదు
COVID-19 in Telangana. | PTI Photo

Hyderabad, April 8: తెలంగాణలో బుధవారం ఉదయం నాటికి కరోనావైరస్ పాజిటివ్ కేసుల (COVID-19 in Telangana) సంఖ్య 404కు చేరింది. మంగళవారం కొత్తగా 40 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు నివేదించారు. ఈ వైరస్ బారి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో 45 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 348 యాక్టివ్ కోవిడ్-19 రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక నిన్న నమోదైన 40 కేసులు పూర్తిగా నిజాముద్దీన్ మర్కజ్ (Nizamuddina Markaz) వెళ్లిన వారు, వారి సన్నిహితులేనని ఆరోగ్య శాఖ అధికారులు స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్‌ నుంచి మంగళవారం 3 పాజిటివ్ కేసులు రాగా,  ఇందులో 23 రోజుల పసికందుకు కూడా ఉండటం ఆందోళన కలిగించే విషయం. దిల్లీ వెళ్లి వచ్చిన వారి నుండి తెలంగాణలో గత ఐదు రోజుల్లోనే 277 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో మార్చి 2న మొదటి కరోనావైరస్ కేసు నమోదైనప్పటి నుండి గణాంకాలను పరిశీలిస్తే ఒక్క హైదరాబాద్‌లోనే ఇప్పటివరకు 171 కేసులు నమోదయ్యాయి, అంటే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో 42 శాతం ఇక్కడి నుంచే ఉన్నట్లు తేలింది. ఇందులో 21 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 150 కోవిడ్-19 పేషెంట్లు చికిత్స పొందుతున్నారు.   మరో 2 వారాలు లాక్డౌన్ పొడగించమని ప్రధానమంత్రిని కోరిన సీఎం కేసీఆర్

36 పాజిటివ్ కేసులతో నిజామాబాద్ జిల్లా హైదరాబాద్ తర్వాత స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోధన్, బాన్సువాడ, ఆర్మూర్ తదితర పట్టణాలు కరోనావైరస్ హాట్ స్పాట్ లుగా ఉన్నాయని అధికారులు గుర్తించారు.

వరంగల్ (అర్బన్) లో 24 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇందులో ఒకరు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 23 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దీని తర్వాత స్థానంలో జోగులాంబ గద్వాల జిల్లాలో 22 కేసులు ఉన్నాయి.

మరోవైపు నిర్మల్ జిల్లాలో ఇప్పటివరకు 4 కేసులే నిర్ధారయినప్పటికీ నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు భైంసా పట్టణాన్ని వైరస్ హాట్ స్పాట్ లుగా అధికారులు గుర్తించారు.