Hyderabad Molestation Case: పంజాగుట్ట 139 మంది రేప్ కేసులో ట్విస్ట్, డాలర్‌ బాయ్ ఒత్తిడి మేరకే వారి పేర్లు చేర్చానని తెలిపిన బాధిత యువతి, కేసుతో ఇతడికి ఉన్న లింకులపై ఆరా తీస్తున్న పోలీసులు
Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyderabad, August 30: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన 139 మంది అత్యాచారం కేసు (Hyderabad Molestation Case) కీలక మలుపులు తిరుగుతోంది.ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగుచూసింది. మీడియా ముందుకు వచ్చిన బాధిత యువతి పలు విషయాలను వెల్లడించారు. తనపై ప్రముఖులు అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు తాజాగా వాటి వెనుక డాలర్‌ బాయ్ ఒత్తిడి ఉందని మీడియాకు తెలిపారు.

సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో బాధితురాలు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. డాలర్‌ బాయ్‌ (dollar boy in 139 persons rape case) ఒత్తిడి మేరకే కొందరి పేర్లు పెట్టాల్సి వచ్చింది. కొంత మందితో తనకు ఎలాంటి సంబంధం లేదని నేను ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా పేర్లు పెట్టించాడు. నన్ను నా ఫ్యామిలీని చంపేస్తానని బెదిరించాడు. చిత్ర హింసలకు గురి చేశాడు. యాంకర్‌ ప్రదీప్, కృష్ణుడికి ఈ కేసుతో సంబంధంలేదు. డాలర్‌ భాయ్‌ పెట్టమంటేనే తాను కేసులు పెట్టానని బాధిత యువతి చెప్పుకొచ్చింది. డాలర్‌ భాయ్‌ తన పట్ల సైకోలా వ్యవహరించాడని తెలిపింది. నన్ను కొట్టి సెలబ్రిటీలతో ఫోన్‌లో మాట్లాడించారని బాధిత యువతి (hyderabad molesting girl) తెలిపింది. 11 ఏళ్ల నుంచి 139 మంది నన్ను రేప్ చేశారు, పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేసిన యువతి

నాపై లైంగికదాడి జరిగింది వాస్తవమే. కానీ అందులో సెలబ్రిటీలు లేరు. నేను బయట 50 శాతం వేధింపులకు గురైతే, 50 శాతం డాలర్ బాయ్ వేధించాడు. అనవసరంగా నా వల్ల ఇబ్బంది పడ్డవారికి క్షమాపణలు చెబుతున్నా. నాలా మరో అమ్మాయికి అన్యాయం జరగొద్దు. డాలర్ బాయ్‌ నాలా మరో ఇద్దరిని కూడా ట్రాప్ చేశాడు’అని బాధితురాలు పేర్కొన్నారు. కాగా, కొన్ని కుల సంఘాలు, మహిళా సంఘాలు బాధితురాలికి మద్దతు ప్రకటించాయి. ఆమెకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశాయి. మంద కృష్ణ మాదిగ, పీవోడబ్ల్యూ పద్మ తదితరులు ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

139 మంది రేప్ కేసులో కీలకంగా మారిన రాజశేఖర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్ లీలలు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. 2018 లో ఉద్యోగం కోసం వచ్చిన యువతిని ట్రాప్ చేసిన డాలర్ బాయ్... ఒరిజినల్ సర్టిఫికేట్ తన దగ్గర పెట్టుకొని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు. అనంతపూర్ కు చెందిన ఈ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి డాలర్ బాయ్ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన తర్వాత డాలర్ బాయ్ విశ్వరూపం తెలిసిన సదరు యువతి షాక్ గురైంది.

మానసికంగా శారీరకంగా వేధిస్తూ సైకో ఆనందం పొందిన డాలర్ బాయ్... డబ్బులు, బంగారం తేవాలంటూ చిత్రహింసలకు గురి చేసాడు. తనని విడిచి వెళ్లి పోతే ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వనని ఆ యువతితో బెదిరింపులకు దిగాడు. దీంతో ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నాడని సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో డాలర్ బాయ్ భార్య ఫిర్యాదు చేసింది. 4 నెలల క్రితం సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కన్సల్టెన్సీ యాడ్ ఏజెన్సీ పేర్లతో పలువురికి ఉద్యోగాల ఆశ చూపి వారి సర్టిఫికెట్లను తన వద్ద పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి ఉంటాడని సిసిఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు.

పంజగుట్ట అత్యాచారం కేసులో నిందితులుగా ఉన్న వారికి ఇతగాడు ఫోన్లు చేసి బెదిరించాడు. వీరిలో కొందరి నుంచి డబ్బు కూడా డిమాండ్‌ చేశాడు. ఈ ఆరోపణలపై ఇప్పటికే ఓ కేసు నమోదు కాగా.. ఆ ఆడియోలు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ నేపథ్యంలో బాధితురాలితో, ఈ కేసుతో ఇతడికి ఉన్న లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ డాలర్‌ బాయ్‌పై చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.