KTR Legal Notices: బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్.. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ కేటీఆర్ మండిపాటు.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారంటూ విమర్శ
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై కాంగ్రెస్, బీజేపీ నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు.
Hyderabad, March 24: టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రశ్నపత్రాల (Question Papers) లీకేజీ (Leak) వ్యవహారంపై కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. నిరాధార, అసత్య ఆరోపణలు చేసినందుకుగాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay)లకు లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అనే జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వాస్తవాలను పక్కన పెట్టి ప్రభుత్వ పరిధిలోనే ఇదంతా జరుగుతోందనే విధంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వీరిద్దరూ మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని ప్రజలు కూడా భావిస్తున్నారని చెప్పారు. వీరి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని అన్నారు. కాగా టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ పై రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా కేటీఆర్ ఏమన్నారంటే?
రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పబ్లిక్ సర్వీస్ కమిషన్కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న కనీస అవగాహన కూడా లేకుండా ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగడం వారి అజ్ఞానానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. స్వతంత్రంగా పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో సంబంధం లేకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ఏర్పాటైందని గుర్తుచేశారు. కానీ, ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్నట్లుగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు సంజయ్, రేవంత్ తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. పాలనా వ్యవహారాల పట్ల కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వీరు అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే పదేపదే తన పేరును చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలను సహించబోనన్నారు.
పిచ్చోడి చేతిలో రాయిలా
కొవిడ్ సమయంలో రూ.10 వేల కోట్ల టీకా కుంభకోణం జరిగిందని, రూ.వేల కోట్ల విలువ చేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే తిక్క వ్యాఖ్యలు చేసి రేవంత్ నవ్వులపాలయ్యారని కేటీఆర్ అన్నారు. బండి పోతే బండి ఫ్రీ అంటూ సంజయ్ చేసిన అర్థరహిత వ్యాఖ్యలను కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్, బీజేపీల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాలను నిలిపేయాలన్న కుతంత్రం..
టీఎస్పీఎస్సీ అంశంలో కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న దుష్ప్రచారాల వెనక మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుట్ర ఉందని కేటీఆర్ అన్నారు. చదువులు పక్కన పెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసి రావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు వాళ్ల కుటిల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయని చెప్పారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్న ఈ రెండు పార్టీల నేతల పిచ్చిమాటల ఉచ్చులో పడకుండా పోటీ పరీక్షల సన్నద్ధతపైనే దృష్టి సారించాలని యువతకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించిందని, భవిష్యత్తులో పరీక్షలను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోందని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Mar 24, 2023 08:48 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

