Omicron in Telangana: తెలంగాణలో ఒక్కసారిగా పెరిగిన ఒమిక్రాన్ కేసులు, తాజాగా 4 కేసులు నమోదుతో ఏడుకు చేరిన మొత్తం కేసుల సంఖ్య, అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్‌ఎంసీలు
A resident gets tested for coronavirus in the Liwan District in Guangzhou in southern China (Photo: PTI)

Hyd, Dec 17: తెలంగాణ రాష్ట్రంలో మరో నాలుగు ఒమిక్రాన్‌ కేసులు (Omicron in Telangana) నమోదయ్యాయి. ఈ కొత్త వేరియంట్‌ కేసులుతో కలపుకుని రాష్టంలో మొత్తంగా ఒమిక్రాన్ కేసులు ఏడుకు (tally raises to 7 in the state) చేరాయి. తొలి మూడు కేసులు వచ్చిన మరునాడే మరిన్ని కేసులు నమోదవడం ఆందోళనకరంగా మారింది. వీరంతా కూడా విదేశాల నుంచి వచ్చినవారేనని.. స్థానికంగా ఒమిక్రాన్‌ కేసులేవీ నమోదు కాలేదని అధికారులు చెప్తున్నారు.

తాజా కేసుల్లో ఒకరు హైదరాబాదీ: బుధవారం నమోదైన మూడు కేసుల్లో ఒకరు సోమాలియాకు, మరొకరు కెన్యాకు చెందినవారుకాగా.. మరొకరు కెన్యా నుంచి వచ్చిన బెంగాలీ. తాజాగా గురువారం వెలుగు చూసిన నాలుగు కేసుల్లో ఒకరు బ్రిటన్‌ నుంచి వచ్చిన 31 ఏళ్ల హైదరాబాద్‌ వాసి. యూసఫ్‌గూడ ప్రాంతానికి చెందిన ఆయన.. లండన్‌ నుంచి దుబాయ్‌ మీదుగా ఈ నెల 15న హైదరాబాద్‌కు వచ్చినట్టు తెలిసింది. ఇక మిగతా ముగ్గురు కెన్యా దేశస్తులే. వీరిలో ఇద్దరు 24 ఏళ్ల యువతులు, ఒకరు 44 ఏళ్ల పురుషుడు ఉన్నారని.. ఈ నెల 13, 14 తేదీల్లో షార్జా, దుబాయ్‌ మీదుగా హైదరాబాద్‌కు చేరుకున్నారని అధికారులు చెప్తున్నారు.

దేశంలోనే మొదటిసారిగా...కిడ్నీలో నుంచి 156 రాళ్లను తొలగించిన హైదరాబాద్ వైద్యులు, పెద్ద ఆపరేషన్‌ చేయకుండానే కీహోల్‌ పద్ధతిలో సర్జరీ పూర్తి

వీరు ముగ్గురూ రాజధాని ( Hyderabad) నగరంలోని ఆసుపత్రుల్లో వైద్య చికిత్సల కోసం వచ్చినట్టు గుర్తించామని' ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. ఒక్కరు మినహా మిగిలిన వారు ముప్పు(రిస్క్‌)లేని దేశాల నుంచి వచ్చిన వారేనన్నారు. కొత్తగా ఒమిక్రాన్‌ సోకిన వారిని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారితో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులను గుర్తించడంపై వైద్యఆరోగ్యశాఖ దృష్టిపెట్టింది. ఈ నలుగురు ఎక్కడెక్కడ పర్యటించారు? ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారు? తదితర సమాచారాన్ని సేకరిస్తోంది. శుక్రవారం వారందరికీ కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తామని, ఎవరికైనా పాజిటివ్‌గా నిర్ధారణయితే నమూనాలు సేకరించి జన్యుక్రమ విశ్లేషణకు పంపుతామని వైద్యవర్గాలు తెలిపాయి.

తాజాగా ఒమిక్రాన్‌ కేసులు (Omicron cases) వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఉలిక్కిపడిన ఆరోగ్యశాఖ విదేశీయులు ఎక్కువగా నివాసముంటున్న టోలీచౌకిలోని ఒక కాలనీపై దృష్టిసారించింది. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించింది. బుధవారం 120 మంది, గురువారం 430 మంది నుంచి నమూనాలను సేకరించింది. వీరిలో ఎవరికైనా కరోనా పాజిటివ్‌ వస్తే, వారి నమూనాలను జన్యుక్రమ విశ్లేషణకు పంపిస్తామని వైద్య వర్గాలు తెలిపాయి.

కేసులు పెరగడంతో వైద్యారోగ్యశాఖ సహా పోలీసు, జీహెచ్‌ఎంసీలు అప్రమత్తమయ్యాయి. టోలిచౌకి పారామౌంట్‌ కాలనీని కంటైన్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. గాలి ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని వార్తలు రావడంతో వైరస్‌ సోకిన బాధితులు తిరిగిన ప్రదేశాల్లో హైపోక్లోరైడ్‌తో శానిటైజ్‌ చేస్తున్నారు. ఆ దారిలో ఇతరులెవరూ ప్రయాణించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు