Shashank Goel: తెలంగాణా రాష్ట్ర సీఈఓగా శశాంక్ గోయెల్, ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం, నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శిగా రజత్ కుమార్‌ నియామకం
Shashank Goel appointed as Chief Electoral Officer of Telangana (Photo-Twitter)

Hyderabad, Mar 07: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer)గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శశాంక్‌ గోయల్‌ (Shashank Goel) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్న రజత్ కుమార్‌ని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.

కొత్త సీఈవో కోసం రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు పేర్లను పంపించగా, మూడు పేర్లను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం చివరకు శశాంక్ గోయల్ పేరును ఖరారు చేసింది. కాగా, 1990 బ్యాచ్‌కు చెందిన డాక్టర్ శశాంక్‌ గోయల్‌ ప్రస్తుతం తెలంగాణ కార్మిక, పరిశ్రమలశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయన సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా, ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా, పర్యాటక, సాంస్కృ తిక శాఖ కార్యదర్శిగా, ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేశారు.

అంతకుముందు కొంత కాలం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సంయుక్త కార్యదర్శిగా డిప్యూటేషన్‌పై పనిచేశారు. విద్యా శాఖ డైరెక్టర్‌గా, నిజామాబాద్, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా కూడా వ్యవహరించారు. గతంలో సీఈవోగా పనిచేసిన రజత్‌కుమార్‌ను ప్రభుత్వం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిం చిన నేపథ్యంలో ఆయన స్థానంలో తాజాగా సీఈసీ శశాంక్‌ గోయల్‌ను నియమించింది. 2018 మేలో టర్కీకి విహార యాత్రకు వెళ్లిన శశాంక్‌ గోయల్‌ కుమారుడు శుభం గోయల్‌ను ఇస్తాంబుల్‌లో దోపిడీ దొంగలు కాల్చి చంపారు.