
Hyderabad, September 28: తెలంగాణలో కరోనా ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. అయితే సోమవారం ఉదయం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. వారాంతంలో నిర్వహించే టెస్టులు తక్కువగా ఉండటం కారణంగానే కొత్తగా నిర్ధారించబడే పాజిటివ్ కేసులు కూడా కొద్దిగా తగ్గుతుండటం గమనించవచ్చు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 35,465 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 1378 మందికి పాజిటివ్ అని తేలింది, అయితే ఇంకా 952 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 28,86,334 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 1,87,211కి చేరుకుంది.
నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 254 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 110 , మేడ్చల్ నుంచి 73 కేసులు నిర్ధారణయ్యాయి.


మరోవైపు గత 24 గంటల్లో మరో 7 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1107 కు పెరిగింది.
అలాగే, ఆదివారం సాయంత్రం వరకు మరో 1932 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 1,56,431 మంది కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 29,673 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొంది.