
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు. టికెట్లు ముందస్తుగా బుక్ చేసుకునేందుకు https://tgsrtcbus.in వెబ్సైట్ను సందర్శించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
ప్రస్తుతం ఈ ప్రత్యేక రాయితీ హైదరాబాద్-బెంగళూరు మార్గానికే పరిమితంగా ఉన్నప్పటికీ, ఇతర ముఖ్యమైన మార్గాల్లోనూ దీన్ని అమలు చేయాలని ప్రయాణికుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీ ఎండీ, వైస్ చైర్మన్ వి.సి. సజ్జనార్ ఈ రాయితీ ప్రకటనను ఎక్స్ (పూర్వం ట్విట్టర్) వేదికగా ప్రకటించగా, అది సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఈ రాయితీ ప్రయోజనాన్ని ప్రయాణికులు వినియోగించుకుని ప్రయాణ ఖర్చును తగ్గించుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.